
చోరీ కేసులో మహిళ అరెస్ట్
ద్వారకాతిరుమల : బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికురాలి బ్యాగ్లో నుంచి పర్సును దొంగిలించిన ఒక మహిళను బుధవారం పోలీసులు అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి 23.92 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో ఎస్సై టి.సుధీర్ వివరాలను వెల్లడించారు. పెరవలి మండలం దేశపాత్రునిపాలెం గ్రామానికి చెందిన బొడ్డు నాగమణి గతేడాది అక్టోబర్ 26న భీమడోలు బస్టాండులో బస్సు ఎక్కుతుండగా, ఆమె భుజానికి ఉన్న బ్యాగ్లోనుంచి పర్సును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించుకుపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ల ఆధ్వర్యంలో భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై టి.సుధీర్, హెడ్ కానిస్టేబుల్ ఎస్.శ్రీనివాస్, సిబ్బంది ఎం.వెంకటేశ్వరరావు, సీహెచ్ లక్ష్మీనారాయణ, వీజే ప్రకాష్బాబు బృందంగా ఏర్పడి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన జడ్డు ముత్యవతి (ముత్యాలమ్మ) చోరీకి పాల్పడినట్టు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ద్వారకాతిరుమలలోని గరుడ బొమ్మ సెంటర్ వద్ద నిందితురాలు ముత్యవతిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 15.360 గ్రాముల బంగారు గొలుసు, 2.740 గ్రాముల చిన్నపిల్లల బంగారు చుట్లు (జత), 5.820 గ్రాముల బంగారు చెవి హ్యాంగిల్స్(జత)ను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు గతంలో కూడా అనేక దొంగతనాలు చేసి జైలు శిక్ష అనుభవించినట్టు తమ విచారణలో తేలిందని ఎస్సై సుధీర్ తెలిపారు.
రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి..
ఉంగుటూరు: రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ద్వారకాతిరుమల మండలం లైను గోపాలపురంనకు చెందిన కూటమి నాయకుడు చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో తల్లాపురం రోడ్డును ఆనుకుని కొత్తగా వెంచర్ వేస్తున్నారు. ఆ వెంచర్లో మెరక పనులు చేస్తున్న నేపథ్యంలో లారీ రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి అక్కడ పనిచేస్తున్న గాది గంటయ్య (55) అక్కడికక్కడే మృతి చెందాడు. గంటయ్యకు భార్య, వివాహం అయిన ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి ఉన్నారు. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

చోరీ కేసులో మహిళ అరెస్ట్