పనికి వెళ్లినా.. నమోదు కాని హాజరు | - | Sakshi
Sakshi News home page

పనికి వెళ్లినా.. నమోదు కాని హాజరు

Jun 19 2025 4:08 AM | Updated on Jun 19 2025 4:08 AM

పనికి వెళ్లినా.. నమోదు కాని హాజరు

పనికి వెళ్లినా.. నమోదు కాని హాజరు

ముసునూరు: ఫీల్డ్‌ అసిస్టెంట్‌, అతని అనుయాయులతో బెదిరింపులకు పాల్పడడంతో ఓ ఉపాధి కూలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం ముసునూరుకు చెందిన చలపాటి రాణి, ఆమె భర్త తంబి ప్రతి రోజూ ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. కాని స్థానిక ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దేవరపల్లి రవితేజ గ్రామస్థాయి రాజకీయాల నేపథ్యంలో గత రెండు వారాలుగా వీరికి హాజరు వేయడం లేదు. దీంతో వారు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను హాజరు విషయంపై ప్రశ్నించారు. రెచ్చిపోయిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రోజూ పనికి వచ్చినా మీకు హాజరు వేయనని తెగేసి చెప్పాడు. నిర్ఘాంత పోయిన బాధితులు ఈ విషయంపై న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. భయపడిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గ్రామంలోని తన అనుయాయులు, పనిలో పాల్గొనకుండా హాజరు పొందుతున్న మరికొందరిని బాధితుల ఇంటి మీదకు ఉసిగొల్పాడు. దుక్కిపాటి విజయకుమార్‌, కొడవలి ఆంద్రెయ, రాజేష్‌, సర్వేశ్వరరావు తదితరులు తంబి ఇంటి వద్ద లేని సమయంలో బాధితుల ఇంటికి వెళ్లి దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా నీ భర్తను చంపేస్తామంటూ రాణిని బెదిరించారు. భయభ్రాంతురాలైన ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను నూజివీడులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. తమను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌, అతని అనుయాయుల నుంచి ప్రాణరక్షణ కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు మొరపెట్టుకుంటున్నారు. దీనిపై తమకు సమాచారం అందలేదని ఎస్సై ఎం. చిరంజీవి చెప్పారు.

ఫీల్ట్‌ అసిస్టెంటును నిలదీసిన ఉపాధి కూలీలు

తన అనుయాయులతో బెదిరింపులకు దిగిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌

భయభ్రాంతులతో మహిళ ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement