
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
ఆగిరిపల్లి : రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో బెంగళూరులో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఆగిరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన పదో తరగతి విద్యార్థులు ప్రహర్ష, రోహిత్, అభిలాష్ ఎంపికయ్యారు. విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు శివ నాగేంద్ర, సుగుణరావును హెచ్ఎం, గ్రామస్తులు అభినందించారు.
బాలిక ఆత్మహత్యపై కేసు నమోదు
భీమడోలు : గుండుగొలనులో బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం గుండుగొలనుకు చెందిన చిట్టిబొమ్మల మోక్షశ్రీ 16) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల పదో తరగతి పూర్తిచేసింది. 350 మార్కులతో ద్వితీయశ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లి వచ్చిన మోక్షశ్రీతో మంగళవారం తండ్రి పోతురాజు పాఠశాలకు వెళ్లాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కుమార్తె మోక్షశ్రీను మందలించాడు. టెన్త్లో సక్రమంగా చదువుకుంటే మంచి మార్కులు వచ్చేవని, ఇలాగే ఇంటర్లో కూడా చదివితే ఇబ్బందులు పడతావంటూ మందలించి బయటకు వెళ్లాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మోక్షశ్రీ సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గదిలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ యూజే విల్సన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై చలపతిరావు తెలిపారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక