
ఏజెన్సీలో విజృంభిస్తున్న జ్వరాలు
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, వర్షాలు కూడా కురుస్తూండడంతో మన్యంలో రోజురోజుకూ టైఫాయిడ్, మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మలేరియా బారిన పడిన జ్వర పీడితులు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. అధికారికంగా జనవరి నుంచి ఇప్పటివరకూ 148 మలేరియా కేసులు నమోదైనప్పటికీ అనధికారికంగా ఆ కేసులు రెట్టింపు ఉండొచ్చని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు కూడా జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి.
అధికంగా మలేరియా కేసులు
ఇటీవలి వర్షాలతో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలతో పాటు జిల్లాలోని ఏలూరు, ద్వారకాతిరుమల, లక్కవరం తదితర గ్రామాల్లో కూడా మలేరియా కేసులు నమోదైనట్టు చెప్తున్నారు. జనవరి నుంచి జూన్ మొదటివారం వరకు బుట్టాయగూడెం మండల పరిధిలోని కేఆర్పురం పీహెచ్సీలో 12 కేసులు, పీఆర్గూడెం పీహెచ్సీ పరిధిలో 23, నందాపురం పరిధిలో 6, దొరమామిడి పరిధిలో 16, అంతర్వేదిగూడెం పరిధిలో 8, వేలేరుపాడు మండలం కొయిదా పీహెచ్సీ పరిధిలో 28, వేలేరుపాడు 4, పోలవరం మండలం కోండ్రుకోట పీహెచ్సీ పరిధిలో 6, ద్వారకాతిరుమల 1, లక్కవరం 1, ఏలూరు 1, కొయ్యలగూడెం 1, రాచన్నగూడెం 6, కామయ్యపాలెం 3తో పాటు పలు గ్రామాల్లో మొత్తం 148 కేసులు జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైనట్లు మలేరియా అధికారులు తెలిపారు.
వెంటాడుతున్న మందుల కొరత
జిల్లాలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని మండలాల్లో ప్రతి గ్రామంలోనూ టైఫాయిడ్, మలేరియా కేసులతో బాధపడుతున్నవారు ఉన్నారు. మలేరియా నివారణకు సంబంధించిన క్లోరోక్విన్ మాత్రలు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవని సమాచారం. గతంలో ఈ మందులనే మలేరియా నివారణకు అధికంగా ఇచ్చేవారు. ఈ మందుల సరఫరా లేకపోవడం వల్ల కిందిస్థాయి సిబ్బందిని బయట కొనుగోలు చేసి ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం. గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో వీటి నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న మలేరియా, టైఫాయిడ్ కేసులు
నామమాత్రంగానే ఉన్న మలేరియా మందులు
జ్వరపీడితులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వాస్పత్రులు
మలేరియా నివారణకు చర్యలు తీసుకుంటున్నాం
జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 148 కేసులు నమోదయ్యాయి. వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఏసీటీ మందులు అందుబాటులో ఉన్నాయి. క్లోరోక్విన్ మాత్రలకు ప్రతిపాదనలు పంపించాం. మలేరియా కేసులు నమోదైన ప్రదేశాల్లో స్ప్రేయింగ్ పనులు చేయించడంతో పాటు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నాం.
– ఎన్ఎస్ఎస్ ప్రసాద్, జిల్లా మలేరియా అధికారి, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం

ఏజెన్సీలో విజృంభిస్తున్న జ్వరాలు

ఏజెన్సీలో విజృంభిస్తున్న జ్వరాలు

ఏజెన్సీలో విజృంభిస్తున్న జ్వరాలు

ఏజెన్సీలో విజృంభిస్తున్న జ్వరాలు