
వంతెనకు రంధ్రం.. అవస్థల్లో జనం
ఉంగుటూరు: మండలంలోని నారాయణపురం వద్ద జాతీయరహదారికి అనుసంధానంగా ఉన్న వంతెనకు భారీ రంధ్రం పడటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భీమవరం నుంచి గణపవరం మీదుగా నారాయణపురం వద్ద జాతీయరహదారికి చేరుకునేందుకు కీలకంగా ఉన్న ఈ వంతెనకు ఆదివారం రంధ్రం పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలు మినహా మరే ఇతర వాహనాలూ వెళ్లకుండా బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వంతెనపై పెద్ద వాహనాల రాకపోకలకు అవకాశం లేకుండా మట్టిని, రాళ్ల గుట్టలను అడ్డుగా వేశారు. ద్విచక్ర వాహనదారులు వాటి మధ్యే ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. కార్లు తదితర వాహనాలు నారాయణపురం శివారులో ఉన్న మట్టి రోడ్డు ద్వారా ఉంగుటూరుకు, మరికొన్ని తల్లాపురం రోడ్డు మీదుగా చేబ్రోలు వంతెనకు చేరుతున్నాయి. మరికొందరు వాహనదారులు చేబ్రోలు పోలీస్స్టేషన్ నుంచి కాలువ గట్టు మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గాలు అంత అనుకూలంగా లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఎట్టకేలకు ఆర్అండ్బీ అధికారుల రాక
వంతెనకు ఆదివారం రంధ్రం పడగా, ఆర్అండ్బీ అధికారులు రెండోరోజైన సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు రావడం గమనార్హం. ఆర్అండ్బీ ఈఈ కిషోర్ బాలాజీ, డీఈ గోవింద మోహన్, ఏఈ ప్రభాకరరావు వంతెన వద్ద రంధ్రం పడిన ప్రాంతాన్ని పరిశీలించి స్థానిక అధికారులు పలు సూచనలు చేశారు. నూతన వంతెన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలుస్తోంది.
బ్రిటీష్ కాలం నాటి వంతెనలు
బ్రిటీష్ వారి కాలంలో కట్టిన ఈ వంతెనలకు కాలం చెల్లింది. 1935లో నిర్మించిన ఈ వంతెనలు దశాబ్ద కాలం నుంచి పట్టు కోల్పోయి బలహీనపడ్డాయి. వేలాది వాహనాలు వీటిపై రాకపోకలు సాగిస్తుండటంతో వీటి సామర్థ్యం తగ్గిపోయిందని, ఆయా వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఆరేళ్ల క్రితం ఉంగుటూరు బ్రిడ్జి కూడా ఇలాగే ధ్వంసం కాగా, దాని స్థానంలో కొత్త వంతెన నిర్మించకుండా రూ.35 లక్షలు వెచ్చించి మరమ్మతులతో సరిపెట్టారు. ఇక నారాయణపురంలో కొత్త వంతెన నిర్మాణంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.

వంతెనకు రంధ్రం.. అవస్థల్లో జనం

వంతెనకు రంధ్రం.. అవస్థల్లో జనం