
శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) న్యాయమూర్తులు సోమవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తులు డాక్టర్ లతా బస్వరాజ్ పాట్నే, షాలిని మిశ్రా (రిటైర్డ్ ఐఏఎస్), రిజిస్ట్రార్ జి.నవీన్ కుమార్, సీఏటీ సిబ్బందికి ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వారికి స్వామివారి శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఏఈఓ రమణరాజు, సూపరింటెండెంట్ హయగ్రీవాచార్యులు చిన వెంకన్న చిత్రపటాలను, ప్రసాదాలను వారికి అందజేశారు.
పోక్సో కేసులో యావజ్జీవశిక్ష
వీరవాసరం: బాలికను మోసపూరిత మాటలతో మభ్యపెట్టి, బెదిరించి, గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి జీవిత కాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి బి.లక్ష్మీనారాయణ సోమవారం తీర్పు చెప్పారు. జరిమానాలో రూ.80 వేలు బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొణితివాడకు చెందిన కండెల్లి రమేష్ స్థానిక బాలిక (16)ను మోసపూరిత మాటలతో మభ్యపెట్టి, బెదిరించి గర్భవతిని చేశాడంటూ ఆమె తండ్రి 2020 జూలై 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై నేరం రుజువవడంతో జడ్జి తీర్పు చెప్పారు.