బాబు పాలన మొత్తం మోసమే | - | Sakshi
Sakshi News home page

బాబు పాలన మొత్తం మోసమే

Jun 16 2025 5:45 AM | Updated on Jun 16 2025 5:45 AM

బాబు పాలన మొత్తం మోసమే

బాబు పాలన మొత్తం మోసమే

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏడాది పాలన మొత్తం మోసమేనని, ప్రజలను నిలువునా వంచించి ఏ ఒక్క పథకమూ అమలు చేయకుండా అన్నీ చేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో జగన్‌ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. గత జగన్‌ ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, చంద్రబాబు హయాంలో మోసం, అశాంతి, అరాచకం, ఆటవిక పాలనను ప్రజలు చూస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పథకం ఇస్తామని ఆడపడుచులను మోసం చేశారని, తాజాగా అమలు చేసినా గతంలో 87 లక్షల మంది లబ్ధిదారులుంటే వారిలో 20 లక్షల మందిని తొలగించడం బాబు దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. జగన్‌ పాలనలో కోవిడ్‌ విపత్తు సమయంలోనూ ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో అప్పుగా తెచ్చిన రూ.1.50 లక్షల కోట్లు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బాబును ముఖ్యమంత్రిని చేసి తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తూ కొత్త తరహా రాజకీయాలకు తెరలేపారని డీఎన్నార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూటమి మోసాలపై పోరు

ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్‌ మాట్లాడుతూ ఏడాది కాలంలో బాబు ప్రజలకు చేసిన మోసాలపై, లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుపై పుస్తకాన్ని ప్రచురించామన్నారు. బాబు మోసాలపై తరచూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు.

పాలనలో విఫలం

చింతలపూడి ఇన్‌చార్జి కంభం విజయరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం సాగుతోందని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పట్టించుకోవడం లేదన్నారు.

అక్రమ కేసుల పర్వం

ఉంగుటూరు ఇన్‌చార్జి పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ జగన్‌ అమ్మఒడి అమలు చేసి పాఠశాల నిర్వహణకు రూ.1,000 కేటాయిస్తే గగ్గోలు పెట్టిన లోకేష్‌ ఇప్పుడు తల్లికి వందనంలో రూ.2 వేల చొప్పున మినహాయించడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేనిపై అక్రమ కేసుపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా అక్రమ కేసుల పర్వం ఆపకపోవడం కూటమి ప్రభుత్వ రాక్షస పాలనకు నిదర్శనమన్నారు.

పార్టీ నాయకులు గుడిదేశి శ్రీనివాస రావు, నెరుసు చిరంజీవులు, కోమటి విష్ణువర్ధన్‌, నూకపెయ్యి సుధీర్‌ బాబు, గంటా మోహనరావు, మున్నుల జాన్‌ గురునాథ్‌, కిలాడి దుర్గారావు, ఇనపనూరి జగదీష్‌, కిలారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement