
గూడెంలో మద్యం పరవళ్లు
వాణిజ్య కేంద్రంగా పేరొందిన తాడేపల్లిగూడెం ఇప్పుడు లిక్కర్ సిండికేట్కు అడ్డాగా మారింది. అడ్డూ అదుపూ లేకుండా నిరంతరం మద్యం అమ్మకాలు సాగిపోతున్నాయి. దాబాల్లో సైతం లిక్కర్ సులువుగా దొరుకుతోంది. ఈ సిండికేట్ను నడిపించేది కూటమి నేతలే కావడంతో ఎకై ్సజ్, పోలీస్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
సాక్షి, భీమవరం: జిల్లాకు ముఖ్య వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెం ఉల్లి, బెల్లం, మామిడి, పప్పు దినుసుల వ్యాపారానికి ప్రఖ్యాతి. చుట్టుపక్కల ప్రాంతాల వారితో పాటు ఇతర జిల్లాల నుంచి హోల్సేల్, రిటైల్ వ్యాపారులు, వినియోగదారులు, సరుకుల రవాణ వాహనాలతో రోజూ పట్టణానికి భారీగా వచ్చి వెళ్తుంటారు. ఇంత ప్రాముఖ్యమున్న పట్టణంలో మద్యం పరవళ్లు తోక్కుతోంది. గత ప్రభుత్వంలో చాలా వరకు ఊరికి దూరంగా ఉన్న మద్యం షాపులను కూటమి ప్రభుత్వం తెచ్చిన ప్రైవేట్ మద్యం పాలసీతో సిండికేట్లు ఇప్పుడు పట్టణంలోని జనావాసాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లోకి తెచ్చేశాయి. ఎకై ్సజ్ పాలసీకి విరుద్ధంగా షాపుల వద్దనే కూర్చుని తాగేందుకు టేబుళ్లు, కుర్చీలతో సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. మందులోకి మంచింగ్, ఫాస్ట్ఫుడ్స్ అందిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అమ్మకాలు చేయాల్సి ఉండగా వేళాపాలా లేకుండా ఇష్టానుసారంగా షాపులు నిర్వహిస్తున్నారు. నిర్ణీత సమయం దాటాక బాటిల్పై అధనంగా రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నట్టు మందుబాబులు చెబుతున్నారు.
తాడేపల్లిగూడెం సర్కిల్ పరిధిలోని తాడేపల్లిగూడెం అర్బన్, రూరల్, పెంటపాడు మండలాల్లో 38 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో పట్టణ పరిధిలో 12 షాపులు, నాలుగు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఒక్కో షాపు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు బెల్టులు తెరిచి బాటిల్పై రూ.30 నుంచి రూ.40 వరకూ అదనంగా అమ్ముతున్నారు. కొందరు మొబైల్ బెల్టులు నిర్వహిస్తూ నేరుగా మందుబాబుల వద్దకే వెళ్లి మద్యం అందిస్తున్నారు. సిండికేట్ కనుసన్నల్లోనే వీటి నిర్వహణ జరుగుతోంది.
సరసమైన ధరలకే
సరసమైన ధరలకే మద్యం దొరుకుతుందంటూ కొన్ని దుకాణాల వద్ద గతంలో బోర్డులు సైతం వెలిశాయి. ఇటీవల వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఈ బోర్డులు, విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలు గురించి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు చేయడంతో సంబంధిత అధికారులు ఆగమేఘాలపై షాపుల వద్ద బోర్డులను తొలగించారు.
గతంలో నిబంధనలు అమలు
బెల్ట్ షాపులపై దాడులు నామమాత్రమే
తాడేపల్లిగూడెం సర్కిల్ పరిధిలో బెల్టు అమ్మకాలుపై ఇప్పటి వరకు 85 కేసులు నమోదుచేసిన ఎకై ్సజ్ పోలీసులు 85 మందిని అరెస్టు చేసి వారి నుంచి 160 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినా ఎక్కడా తగ్గకుండా బెల్టుల నిర్వహణ యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలు తుంగలోకి తొక్కడంతో నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రైవేట్ షాపులు ప్రారంభించిన గత ఏడాది అక్టోబరు 16 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సర్కిల్ పరిధిలో 1,93,792 కేసుల లిక్కర్, 73,019 కేసుల బీర్లు విక్రయాలు జరగగా వీటిలో అధిక శాతం తాడేపల్లిగూడెంలోనే జరిగినట్టు సమాచారం. గత మూడు నెలల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగాయి. గత ప్రభుత్వ మద్యం దుకాణాలతో పోలిస్తే లిక్కర్ సేల్స్ భారీగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
తాడేపల్లిగూడెంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
బార్లను తలదన్నేలా షాపుల వద్ద సిట్టింగ్ ఏర్పాట్లు
దాబాల్లోనూ మద్యం లభ్యం
గత ఐదున్నర నెలల్లో 1,93,792 కేసుల లిక్కర్, 73,019 కేసుల బీర్లు విక్రయాలు
దాబాల్లో విచ్చలవిడిగా మద్యం
పట్టణంలో పది వరకు దాబాలు ఉండగా పలుచోట్ల ఫుడ్తో పాటు మద్యం కూడా అందిస్తున్నారు. ఎమ్మార్పీ ధరపై క్వార్టర్ బాటిల్కు అదనంగా రూ. 30, బీర్లకు రూ. 40 వరకు పెంచి సరఫరా చేస్తున్నారు. బార్లను తలపించేలా మందుబాబుల కోసం రాత్రి వేళల్లో ఆరుబయట మంచాలు ఏర్పాటుచేసి మరీ దాబాలను నిర్వహిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. పట్టణ శివార్లు, హైవేకు సమీప దాబాల్లో ఈ తరహా అమ్మకాలు ఎక్కవగా జరుగుతున్నాయి..
వైఎస్సార్సీపీ హయాంలో నిబంధనల మేరకు మద్యం అమ్మకాలు సాగేవి. బెల్టుషాపులు అరికట్టడంతో పాటు నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. షాపుల వద్ద కొనుగోలు చేసి తీసుకువెళ్లిపోవడమే తప్ప తాగేందుకు వీలు లేకుండా చేశారు. షాపుల నిర్వహణ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో మద్యం ఆదాయం పూర్తిగా ప్రభుత్వ ఖజానాకు చేరేది. కాగా కూటమి ప్రభుత్వం మద్యాన్ని మరలా ప్రైవేట్ పరం చేయడంతో సిండికేట్లు ఇష్టారాజ్యంగా మారింది.

గూడెంలో మద్యం పరవళ్లు