
కొల్లేరు సమస్యలను సుప్రీంకు నివేదిస్తాం
సీఈసీ సభ్యుడు చంద్రశేఖర్ గోయల్
ఏలూరు(మెట్రో): కొల్లేరు ప్రాంత సమస్యలపై రెండు రోజులు అధ్యయనం అనంతరం నిర్ధేశించిన కాలపరిమితిలోపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని సీఈసీ సభ్యుడు చంద్రశేఖర గోయల్ వెల్లడించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించిన కొల్లేరు సరస్సు ప్రాంత ప్రజల సమస్యలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధ్యయనం చేసేందుకు గోయల్ నేతృత్వంలో బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. ఏలూరులో రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 1999లో కొల్లేరు పరిరక్షణ అంశం నోటిఫై చేశారన్నారు. కొల్లేరు విషయంలో రీమార్కేషన్, సంబంధిత విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిందన్నారు. ఈ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. ఇంకా పరిష్కారం కాని అంశాలు ఉన్నాయని గోయల్ చెప్పారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిన అంశాలపై నివేదిక ఇవ్వాలని తమ కమిటీని నియమించారని, ఆ దిశగా తొలిరోజు ఏలూరు జిల్లా పరిధిలోని కొల్లేరు గ్రామాల్లో పర్యటించామన్నారు. అక్కడ వాస్తవ పరిస్థితి, ప్రజలతో ముఖాముఖి, తమకు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పరిశీలించామని వివరించారు. తొలిరోజు పర్యటన తమ పరిశీలనలో ముందడుగు అన్నారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రితో భేటీ అయ్యామని చెప్పారు. బుధవారం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా అధికారులుతో మరో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ రెండు రోజుల పర్యటన అనంతరం గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తమకు 12 వారాల గడువు ఇచ్చిందని చెప్పారు. సమావేశంలో కమిటీ మెంబరు కార్యదర్శులు డా.జె.ఆర్.భట్, జి.భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్రభట్లతో పాటు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అజేయ్ కుమార్ నాయక్, మత్స్యశాఖ కమిషనరు రమాశంకర్ నాయక్, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.పి.ఎస్.కిషోర్, తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఏలూరు చేరుకున్న కేంద్ర సాధికార కమిటీ సభ్యులకు కలెక్టర్ ఘనంగా స్వాగతం పలికారు.