
మహిళలకు రక్షణ కరువు
ఏలూరు టౌన్: రాష్ట్రంలో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని, ఏకంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మహిళలపై దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి తెలిపారు. ఒక మహిళ హోమంత్రిగా ఉంటున్నా మహిళలకు రక్షణ లేకపోవటం సిగ్గుచేటని, ఒక మహిళను పట్టపగలు నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి చెట్టుకు కట్టేసి కొట్టడం దారుణమన్నారు. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలపై ప్రభుత్వం స్పందించలేదని, కనీసం దోషులను అరెస్ట్ చేయలేదని, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళల కోసం శక్తి యాప్ పెట్టాం, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పుకునే కూటమి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం బాధాకరమని తెలిపారు. మహిళలు, యువతులు, బాలికలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యాచారాలు చేస్తుంటే వైఎస్సార్సీపీ పెద్దెత్తున మహిళల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పారు.