వైఎస్‌ జగన్‌ను కలిసిన జిల్లా నేతలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన జిల్లా నేతలు

Jun 18 2025 3:39 AM | Updated on Jun 18 2025 3:39 AM

వైఎస్‌ జగన్‌ను కలిసిన జిల్లా నేతలు

వైఎస్‌ జగన్‌ను కలిసిన జిల్లా నేతలు

ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏలూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌, ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలోని పలువురు పార్టీ నేతలను సమన్వయకర్త జేపీ పరిచయం చేశారు. పార్టీ బలోపేతానికి పనిచేయడంతోపాటు, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ నేతలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో ప్రజలు పడుతున్న కష్టాలపై ప్రజల్లోకి వెళ్ళి వివరించాలని సూచించారు.

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పదవులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలకు పదవులు కేటాయిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా వెజ్జు వెంకటేశ్వరరావు (ఉంగుటూరు), ఎస్టీ సెల్‌ కార్యదర్శిగా బాణావతు రాజు(నూజివీడు), ఎస్టీ సెల్‌ కార్యదర్శిగా ఉయ్యాల సుబ్బారావు (ఏలూరు), రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శిగా మహ్మద్‌ గాలీబ్‌ బాబు(కై కలూరు), రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ కార్యదర్శిగా కట్టా యేసుబాబు (దెందులూరు), రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ కార్యదర్శిగా మిడతా రమేష్‌ (చింతలపూడి), రాష్ట్ర కల్చరల్‌ వింగ్‌ కార్యదర్శిగా తుమ్మాలపల్లి రామేశ్వర శర్మ (ఏలూరు), రాష్ట్ర కల్చరల్‌ వింగ్‌ కార్యదర్శిగా గుమ్మడి సంజీవ్‌ రావు (పోలవరం)ను నియమించారు.

బ్రైట్‌ మైండ్‌ స్కూలుకు గుర్తింపు లేదు

కామవరపుకోట: మండలంలో తడికలపూడిలో కళ్ళచెరువు వెళ్లే రోడ్డులో ఉన్న కెఆర్‌ఆర్‌ బ్రైట్‌ మైండ్‌ స్కూలుకు గుర్తింపు లేదని ఏలూరు ఉపవిద్య శాఖ అధికారి ఎన్‌.రవీంద్రభారతి తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా యాజమాన్యం అడ్మిషన్లు చేస్తున్నారని ఫిర్యాదులు అందటంతో ఆమె మంగళవారం తనిఖీ చేయగా.. పాఠశాలకు గుర్తింపు లేదని తేలింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చి వారి భవిష్యత్తును ఇబ్బందులలో పెట్టకుండా చూడాలని, గుర్తింపు లేని పాఠశాలలో చదివితే, ప్రభుత్వం నుంచి పొందే పథకాలు వర్తించవని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని గుర్తింపు ఉన్న పాఠశాలల్లో చేర్పించాలని ఆమె కోరారు.

డీఎస్సీ పరీక్షకు 1020 మంది హాజరు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 1020 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్‌ కేంద్రంలో ఉదయం పరీక్షకు 186 మందికి 183 మంది హాజరు కాగా.. మధ్యాహ్నం సెషన్‌లో 180 మందికి 168 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం సెషన్‌లో 147 మందికి 140 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్‌లో 140 మందికి 136 మంది హాజరయ్యారు. సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 210 మందికి 206 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్‌లో 200 మందికి గాను 187 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement