
పంట నాణ్యతపై దృష్టి పెట్టాలి
పెదవేగి: రాష్ట్రంలో ఏ రైతుకు కష్టం వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. పెదవేగి మండలం వంగూరులోని విజయ గార్డెన్స్లో కోకో రైతులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటల నాణ్యతపై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. నాణ్యమైన పంటలకు అధిక ధర లభిస్తుందన్నారు. కోకో రైతులు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసి కోకో కేజీ రూ.500 కొనుగోలు చేసేలా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని, దీనిలో రూ.50 ప్రభుత్వం సబ్సిడీగా రైతుకు అందిస్తుందన్నారు. కోకో రైతులు ఆందోళన చెందవద్దని, రైతుల వద్ద ఉన్న కోకో పంటను కంపెనీలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి బుడితి రాజశేఖర్ మాట్లాడుతూ కోకో పంటను రైతుల నుంచి పూర్తిగా కొనుగోలుకు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, హార్టికల్చర్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పీ–4 కార్యక్రమంలో భాగంగా దెందులూరుకు చెందిన పంది శ్రీనుకు 100 గొర్రెలను మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం అందజేశారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో రూపొందించిన పి–4 విధానం పేదరికంలో ఉన్న ప్రజల జీవన పరిస్ధితులు మెరుగుపరచేందుకు దోహదపడుతుందన్నారు.