
గంజాయి తరలిస్తూ పట్టుబడిన యువకుడు
కుక్కునూరు: గంజాయి తరలిస్తూ ఓ యువకుడు జాలర్లకు పట్టుబడ్డాడు. వివరాల ప్రకారం కూనవరం మండలం పోలిపాక గోదావరి రేవు నుంచి గోదావరి దాటితే కుక్కునూరు మండలంలోని వింజరం గ్రామానికి చేరుకోవచ్చు. ఈ రేవు గుండా పలువురు కుక్కునూరు, కూనవరం మండలాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. బుధవారం ఓ యువకుడు వింజరం రేవుకు వెళ్లేందుకు పోలిపాక రేవుకు చేరుకున్నాడు. జాలర్లకు అనుమానం వచ్చి ఆ యువకుడి బ్యాగ్ని తనిఖీ చేయగా అతని వద్ద గంజాయి లభించింది. దీంతో జాలర్లు ఆ యువకుడిని పట్టుకుని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బహిర్గతమైంది. ఈ విషయమై అక్కడి పోలీసులకు సమాచారం అందడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కాగా గత మూడు నెలల క్రితం కూడా పోలిపాక రేవు నుంచి వింజరం రేవు మీదుగా తెలంగాణకు గంజాయి తరలిస్తుండగా తెలంగాణ పోలీసులు బూర్గంపాడు వద్ద పట్టుకున్నారు.