
సాక్షి మీడియాపై దాడులు అరికట్టాలి
చింతలపూడి/తణుకు అర్బన్/ఆకివీడు: సంబంధం లేని విషయాన్ని సాక్షికి ఆపాదిస్తూ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై చేస్తున్న దాడులను అరికట్టాలని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ చింతలపూడిలో సాక్షి పాత్రికేయుల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు సిఐ టి.క్రాంతికుమార్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. సాక్షి కార్యాలయాలకు రక్షణ కల్పించడంతోపాటు జర్నలిస్టులకు కూడా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమ కేసులో ఇరికించారని తక్షణం విడుదల చేసి అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి కార్యాలయాలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై కె.ప్రసాద్కు విలేకరులు వినతిపత్రం అందచేశారు. సాక్షి కార్యాలయాలపై దాడికి దిగిన వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని కోరారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని జర్నలిస్టు గుడిపాటి వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీనియర్ జర్నలిస్టు కె.శ్రీనివాసరావును అరెస్టును నిరసిస్తూ మంగళవారం ఆకివాడు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.