
ఇంజినీరింగ్ కార్మికుల వేతనాలు పెంచాలి
నూజివీడు: ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ పట్టణ కార్యదర్శి జీ రాజు డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపాలిటీలోని ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, రూ.26 వేల కనీస వేతనాన్ని చెల్లించాలన్నారు. ప్రతి నెలా పదో తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, 25 శాతం పీఎఫ్ చెల్లించాలన్నారు. సమ్మె ఒప్పంద జీఓలు ఇవ్వాలని, కార్మికులందరికి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు.