
డ్రెయిన్లు ఇలా.. మురుగు పారేదెలా!
ఉండి: మేజర్ డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులు చేపట్టకపోవడంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయిన్లలో ఎక్కడికక్కడ గుర్రపుడెక్క, చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు పారుదల సక్రమంగా లేకపోవడంతో వర్షాకాలంలో డ్రెయిన్లు పొంగి పంట పొలాలు నాశనమవుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వరిచేలల్లో చేరిన నీరు సైతం బయటకు పోవాలంటే డ్రెయినేజీ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండాలి. కానీ అధికారుల నిర్లక్ష్యమో, పాలకుల పాపమో తెలియదు గాని నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోను మేజర్ డ్రెయిన్ల పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. పంటకాలువల్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో ఇరిగేషన్ అధికారులు పూడికతీత పనులను మమ అనిపించారు.
బొండాడను పట్టించుకోలేదు
మూడు మండలాల్లో విస్తరించి వున్న బొండాడ మేజర్ డ్రెయిన్ను మాత్రం అధికారులు పట్టించుకోలేదు. ఇక్కడ పూడికతీత పనులు నిర్వహించకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఈ డ్రెయిన్ ద్వారా ఉండి మండలంలోని కోలమూరు, ఉప్పులూరు, చిలుకూరు, వెలివర్రు, ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, మహదేవపట్నం, వాండ్రం, కాళ్ల మండలంలోని బొండాడ, జక్కరం, కోపల్లె, ఎల్ఎన్పురం, ఆకివీడు మండలంలోని పెదకాపవరం, చినకాపవరం గ్రామాల్లోని వరిసాగు, ఆక్వాసాగు వ్యర్థాలు పారుతుంటాయి. అయితే ఈ ఏడాది కొన్ని డ్రెయిన్లలో పూడికతీత పనులు చేపట్టిన అధికారులు మేజర్ డ్రెయిన్ అయిన బొండాడను ఎందుకు పట్టించుకోలేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బొండాడ మేజర్ డ్రెయిన్లో ఉండి ఆక్విడెక్టు వల్ల దానికి పైనున్న కోలమూరు, ఉప్పులూరు, చిలుకూరు, వెలివర్రు, ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, మహదేవపట్నం గ్రామాల వరిసాగుతో పాటు ఆక్వాసాగు నీట మునుగుతుంది. అక్విడెక్టు వద్ద ఎత్తున గుర్రపుడెక్క, చెత్తాచెదారం మేటలు వేయడంతో సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. అయితే వేసవి సమయంలో అక్విడెక్టు వద్ద మేటలను తొలగించాల్సిన అధికారులు సాగు సమయంలో లేదా వర్షాలు వస్తున్న సమయంలోనో, రైతులు ముంపునకు గురయ్యామని గగ్గోలు పెట్టినప్పుడు మాత్రమే పొక్లెయిన్ల సహాయంతో తాత్కాలిక పనులు చేపడుతున్నారు. ఈ పనులను కనీసం వేసవిలోగాని, నీరు తగ్గిన సమయంలో గానీ ఎందుకు చేపట్టడం లేదని ముంపు గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇవే కాకుండా పలు మీడియం, మైనర్ డ్రెయిన్లలోను పూడికతీత పనులు నిర్వహించకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే ఆకివీడు మండలంలో ఉప్పుటేరు మేజర్ డ్రెయిన్, కాళ్ళ మండలంలో బొండాడ మేజర్ డ్రెయిన్.7 కిమీ.మేర, పాలకోడేరు మండలంలో పొలిమేర కోడు, గోస్తనీ డ్రెయిన్ వంటి పలు మేజర్ డ్రెయిన్లను కూడా అధికారులు పట్టించుకోలేదు. వీటిలో కనీసం పూడికతీత పనులు చేపడితే రైతులు నిర్భయంగా సాగు చేసుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆక్వా సాగుకు ప్రమాదమే
నియోజకవర్గంలోని పలు మేజర్ డ్రెయిన్లు బిగదన్నడంతో చాలాసార్లు వరిసాగుతో పాటు ఆక్వాసాగు కూడా నీట మునిగింది. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. ఆక్వాజోన్ ఉన్న ఉండి నియోజకవర్గంలో డ్రెయిన్ల పరిస్థితి దారుణంగా ఉంటే ఇక ఆక్వా పరిస్థితి ఏమవుతుందో అని రైతులు ఆంధోళన చెందుతున్నారు.
అరకొరగా కొన్ని డ్రెయిన్ల పూడికతీత పనులు
మేజర్ డ్రెయిన్లలో పనులే చేపట్టని వైనం
ఏటా పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతుల ఆవేదన
ఏటా ముంపు చవిచూస్తున్నాం
ప్రతి ఏటా వర్షాకాలంలో, తుపాను సమయాల్లో డ్రెయిన్లు పొంగి పొలాల మీద పడడంతో రైతులు నష్టాలు చవిచూస్తునఆనరు. మేజర్ డ్రెయిన్లు బిగదన్నడంతో ముంపు భయంతోనే వ్యవసాయం చేస్తున్నాం. ఇది అధికారులకు తెలిసి కూడా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం లేదు.
– నిమ్మల కేశవకుమార్, ఎంపీటీసీ, రైతు, ఉప్పులూరు
ప్రభుత్వమే ఆదుకోవాలి
రైతకు అండగా నిలిచిన ప్రభుత్వమే పది కాలాల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. రైతుల సమస్యలను తెలుసుకుని అధికారులు ప్రభుత్వానికి నివేదించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. రైతులను పట్టించుకోకపోతే కాడి విడిచి పెట్టి వ్యవసాయానికి నమస్కారం చెబుతాడు.
– వర్రే పైడియ్య, మాజీ ఎంపీటీసీ, రైతు, పాములపర్రు

డ్రెయిన్లు ఇలా.. మురుగు పారేదెలా!

డ్రెయిన్లు ఇలా.. మురుగు పారేదెలా!

డ్రెయిన్లు ఇలా.. మురుగు పారేదెలా!