
గ్రామాల్లో తాగునీటి సరఫరాకు చర్యలు
సంత మార్కెట్లో
చెత్తాచెదారాల తొలగింపు
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి సంత మార్కెట్, పండ్ల మార్కెట్లో మంగళవారం సాయంత్రం చెత్త చెదారాలు, వ్యర్థాలను తొలగించారు. మార్కెట్లో చెత్తాచెదారాలు, వ్యర్థాలు తొలగించడం లేదని, ఈగలు వాలడం, దుర్గంధం వెదజల్లుతుండడంతో ‘పొంచి ఉన్న వ్యాధుల ముప్పు‘ శీర్షికన సాక్షి మంగళవారం కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన మున్సిపిల్ సిబ్బంది కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్ వద్ద పరిసరాలను పరిశుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులచే, రెండు స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కాంపాక్టర్లను ఉపయోగించి చెత్తాచెదారాలు, వ్యర్థాలను తొలగించారు. మామిడి పండ్లు ట్రేలలో వ్యర్థాలను సైతం తొలగించారు.
భీమడోలు: గ్రామాల్లో తాగునీటి కోసం గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై ‘తాగునీటి వెతలు’ శీర్షికన మంగళవారం సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు స్పందించారు. గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ టి.త్రినాధబాబు ఆకస్మికంగా పర్యటించారు. గుండుగొలనులో ఆర్డబ్ల్యూఎస్ డీఈ రామారావు, ఏఈ సుబ్రహ్మణ్యంలతో కలిసి ఆయన వింధ్యవాసిని, బ్రాహ్మణ చెరువుల నీటి మట్టాలను పరిశీలించారు. ఇకపై పూర్తిగా బోర్ నీటిని ఇవ్వద్దని, తక్కువ బోర్ నీటిని మంచినీటిలో కలిపి ఫిల్టర్ చేసి గ్రామ ప్రజలకు సరఫరా చేయాలని గ్రామకార్యదర్శికి సూచించారు. గుండుగొలను, భీమడోలు, కురెళ్లగూడెం, పూళ్ల తదితర గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో చిక్కపడిన నీరు పల్చబడేందుకు పటికను కట్టించారు. ఫిల్టర్ బెడ్స్లో నింపుతున్న నీటిని ఆయన పరిశీలించారు. చెరువుల్లోని నీటి నాణ్యతను పరీక్షించేందుకు నమూనాలు సేకరించారు. గోదావరి కాల్వకు నీటిని వదిలిన నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో నీటి మట్టాలు పెరిగే అవకాశాలున్నాయన్నారు. తక్షణమే చెరువుల్లోకి నీటిని నింపేలా తగు చర్యలను తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామకార్యదర్శి కేవీ తనూజ, సచివాలయ ఉద్యోగులు, ఆర్డబ్ల్యూఎస్ వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్, సిబ్బంది చందు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో తాగునీటి సరఫరాకు చర్యలు

గ్రామాల్లో తాగునీటి సరఫరాకు చర్యలు