కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి | - | Sakshi
Sakshi News home page

కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి

Jun 11 2025 8:52 AM | Updated on Jun 11 2025 8:52 AM

కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి

కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): కొల్లేరును 5 నుంచి 3వ కాంటూరుకు కుదించాలని, కొల్లేరు ప్రజల ఉపాధిని కాపాడాలని, ఎకో సెన్సిటివ్‌ జోన్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఏలూరు ఉద్దరాజు రామం భవనంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షతన కొల్లేరు ప్రజల సమస్యల పై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వివిధ ప్రజా సంఘాలు, కొల్లేరు ప్రాంత నాయకులు, రైతు సంఘాలు, సామాజిక వేత్తలు పాల్గొని కొల్లేరు ప్రజల సమస్యలపై చర్చించారు. 2006లో ఆపరేషన్‌ కొల్లేరు పేరుతో ఐదో కాంటూరు లోపల ఉన్న వేలాది ఎకరాలను చెరువులన్నింటినీ ధ్వంసం చేసి లక్షలాదిమంది కొల్లేరు ప్రజల జీవనాన్ని నాశనం చేశారని విమర్శించారు. దీనికితోడు కొందరు పర్యావరణం పేరుతో సుప్రీంకోర్టుకు వెళ్లారని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్‌ కాకపోవడంతో కొల్లేరు పేదల సాగులో ఉన్న 15వేల ఎకరాలు చెరువులు ధ్వంసం వేయాలని సుప్రీంకోర్టు ఏకపక్షంగా తీర్పు ఇచ్చిందన్నారు. కొల్లేరు చుట్టుపక్కల 89 గ్రామాల్లోని లక్షలాదిమంది ప్రజల పొట్ట కొట్టే నిర్ణయాన్ని తక్షణమే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బీ.బలరాం, రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌, కొల్లేరు గ్రామాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు చాగంటి సంజయ్‌, కొల్లేరు ప్రాంత మహిళా నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు, కొల్లేరు రైతు సంఘం, కొల్లేరు గ్రామాల అభివృద్ధి సంఘం నాయకులు తదితరులు మాట్లాడారు.

రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్లు

● కొల్లేరును 5 నుంచి 3వ కాంటూరుకు కుదించాలి. కొల్లేరు ఆపరేషన్‌ సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కొల్లేరు ప్రజలకు జీవనోపాధి కల్పించాలి. 146 సొసైటీలు పునరుద్ధరణ చేయాలి. 14,800 ఎకరాలు జిరాయితీ భూమి హక్కుదార్లకు అప్పగించాలి.

● కొల్లేరు ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. ప్రస్తుత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, సుప్రీంకోర్టుకు నివేదించాలి.

● కొల్లేరు చుట్టుపక్కల ఫ్యాక్టరీల నుంచి వస్తున్న మురుగు నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రతిపాదిత రెగ్యులేటర్లు నిర్మించాలి. 3వ కాంటూరు పరిధిలో సరస్సును అభివృద్ధి చేయాలి.

● కొల్లేరులో ఉన్న వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి. అటవీ అధికారుల వేధింపులు, అవినీతి అరికట్టాలి.

● 5వ కాంటూరు పైన కొల్లేరు ఆపరేషన్‌ పేరుతో కొట్టేసిన 9వేల ఎకరాలు తిరిగి అప్పగించాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు అదనంగా ఉపాధి హామీ పనులు కల్పించాలి.

● కొల్లేరు ఆపరేషన్‌ సందర్భంగా ప్రజలకు ఇస్తానన్న నష్టపరిహారం, ఉపాధికల్పనకు చర్యలు చేపట్టాలి. కొల్లేరు గ్రామాలకు రోడ్లు, విద్యుత్‌, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలి.

ఎకో సెన్సిటివ్‌ జోన్‌ను ఉపసంహరించుకోవాలి

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement