విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

Jun 11 2025 8:52 AM | Updated on Jun 11 2025 12:07 PM

చింతలపూడి: చింతలపూడి మండలం, జార్జిపేట గ్రామానికి చెందిన గాదె కుమార్‌రాజు(45) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. మంగళవారం పొలంలో పనికి వెళ్లిన కుమార్‌రాజు తెగిపడి ఉన్న విద్యుత్‌ వైరును చూసుకోకుండా నీళ్లలోకి దిగడంతో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఇటీవలే మృతి చెందడంతో కుమారుని వద్ద ఉంటున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమార్‌రాజు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

విద్యుత్‌ బిల్లులు పెంచి మరోసారి మోసం

అత్తిలి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిత్యావసరాల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దివ్యాంగ విభాగం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు బుడితి సుజన్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. విద్యుత్‌ బిల్లులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచమని ఎన్నికల ముందు చంద్రబాబు బూటకపు హామీలను గుప్పించి అధికారం చేపట్టిన మరుక్షణమే అనేక సార్లు విద్యుత్‌ బిల్లులు పెంచి ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. మరోపక్క వేసవి తాపంతో అల్లాడుతుంటే అసంఘటిత విద్యుత్‌ కోతలు విధించడంతో వృద్ధులు, చంటిపిల్లలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం గడిపేస్తోందని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌, తల్లికి వందనం, వసతి దీవెన వంటి పథకాలకు తిలోదకాలిచ్చి పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని దారుణమైన వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

సరిహద్దు వివాదంలో కత్తులతో ఇరువర్గాల దాడి

ఏలూరు టౌన్‌: సరిహద్దు వివాదంపై ఇరువర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఫిరంగులదిబ్బ ప్రాంతానికి చెందిన ఇబ్బా వెంకటేశ్వరరావుకు, మరో వ్యక్తి వెంకటేశ్వరరావు మధ్య ఇంటి సరిహద్దు వివాదం ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వీరిద్దరూ బాహాబాహీకి దిగి రాడ్డులతో కొట్టుకున్నారు. కుటుంబ సభ్యులు ఇద్దరినీ ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇదే సందర్భంలో నాగరాజు తన తండ్రి ఇబ్బా వెంకటేశ్వరరావును పరామర్శించి ఆసుపత్రి నుంచి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో రిజిస్ట్రార్‌ కార్యాలయం సమీపంలో వేరే వర్గానికి చెందిన కొందరు అతడ్ని నిలువరించి ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగరాజుతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. వారిని ఏలూరు జీజీహెచ్‌లో చేర్పించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతడ్ని విజయవాడ సర్వజన ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement