
తహసీల్దార్ బదిలీ.. రాజకీయ కుట్రేనా!
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం తహసీల్దార్ కుంజా చెల్లన్నదొర బదిలీ వ్యవహారం ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఆగస్టులో కొయ్యలగూడెం తహసీల్దార్గా చెల్లన్నదొర బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన్ను కలెక్టరేట్లోని సూపరింటెండెంట్ కార్యాలయంలో కోఆర్డినేషన్ సెక్షన్కి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొయ్యలగూడెంలోని జాతీయ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భూమి విషయంలో ఆయన రాజకీయ ఒత్తిళ్లకు లొంగకపోవడమే బదిలీకి కారణమని జోరుగా ప్రచారం సాగుతోంది.
అసలు కారణం ఇదేనా!
గత నెల రోజులుగా కొయ్యలగూడెంలోని ఓ ప్రాంతానికి చెందిన అతి విలువైన ఎకరం యాభై సెంట్లు భూమిపై వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 45 సంవత్సరాల నుంచి సుమారు వంద కుటుంబాల వారు నివసిస్తున్న ప్రాంతాన్ని ఒక వ్యక్తి తనకు చెందినదిగా రికార్డును తహసీల్దార్కు సమర్పించడం జరిగింది. దీనిపై పలుమార్లు అధికారులతో కలిసి సర్వే నిర్వహించి నివేదికను తహసీల్దార్ ఆర్డీవోకి అందజేశారు. సుమారు రూ.15 కోట్ల విలువైన భూమిని తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు దావా వేసిన వ్యక్తి ద్వారా కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వానికి చెందిన ఒక ఎంపీ లాబీయింగ్ నిర్వహించినట్లు తెలిసింది. ఎకరంన్నర భూవివాదం సక్సెస్ అయితే ఇదే ప్రాంతంలోని మరో 11 ఎకరాల భూమి కూడా సొంతం చేసుకోవడానికి (దీని విలువ సుమారు రూ.40 కోట్లు) ఎంపీ కోటరి ప్రయత్నిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఎంపీ పార్టీకే చెందిన ఎమ్మెల్యే ఒకరు దీనికి వంత పాడగా కూటమిలోని మరో ఎమ్మెల్యే వ్యతిరేకించడంతో ఆయన్ను అధిష్టానం పెద్దల ద్వారా బుజ్జగించినట్లు తెలిసింది. తుదకు తహసీల్దార్ నివాసితులైన వారికే అనుకూలంగా రిపోర్టు ఇవ్వడంతో, మింగుడు పడని ఎంపీ ప్రాధాన్యత లేని శాఖకు తహసీల్దారును బదిలీ చేయించారని రెవెన్యూ శాఖలో గుసగుసలు వినవస్తున్నాయి. అనంతరం తహసీల్దారుగా రెవెన్యూ శాఖలోని డిప్యూటీ తహసీల్దార్ స్థాయి ఉద్యోగిని నియమిస్తూ ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీచేశారు. కానీ సదరు రెవెన్యూ ఉద్యోగి కుంపటిలా ఉన్న భూవ్యవహారం ఎక్కడ తన పీకకు చుట్టుకుంటుందోనన్న భయంతో బాధ్యతలు స్వీకరించడానికి విముఖత వ్యక్తం చేశారని అంటున్నారు.
కొందరు పెద్దలకి వంత పాడని అధికారి
కక్ష గట్టి కలెక్టరేట్కి ట్రాన్స్ఫర్ చేశారని గుసగుసలు