
జూదాలకు బానిసై యజమాని ఇంట్లోనే చోరీ
ఏలూరు టౌన్: జూదాలకు బానిసైన ఓ వ్యక్తి తాను పనిచేసే యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. చివరకు ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.23.76 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ వివరాలు వెల్లడించారు. గణపవరం గ్రామానికి చెందిన సరిపల్లి రాజు అలియాస్ వెంకటరాజు అనే వ్యక్తి చిలువూరి వెంకట రామరాజు అలియాస్ వెంకన్న బాబు చెరువుపై పనిచేస్తున్నాడు. సరిపల్లి రాజు పేకాట, క్రికెట్ బెట్టింగ్, మద్యం వంటి దురలవాట్లకు బానిసై యజమాని ఇంట్లోనే చోరీ చేసేందుకు స్కెచ్ వేశాడు. యజమాని రామరాజు మే నెలలో హైదరాబాద్ వెళ్లడంతో సరిపల్లి రాజు ఈ నెల మొదటివారంలో రాత్రిపూట యజమాని ఇంటి వెనుక తలుపులు పగులుకొట్టి లోనికి ప్రవేశించి చెక్క బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకుపోయాడు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు గణపవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను భీమవరంలో విక్రయించేందుకు వెళ్తుండగా ఈనెల 10న సరిపల్లి గ్రామం సీపీఎఫ్ ఫ్యాక్టరీ వద్ద నిందితుడు సరిపల్లి రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ సొత్తు 33 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్, గణపవరం ఎస్సై ఏ.మణికుమార్, పోలీస్ సిబ్బంది ఏయూజీ శంకర్, డీ.శివాజీ, హోంగార్డు పీ.జగపతిబాబును ఎస్పీ శివ కిషోర్ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
చోరీ సొత్తు రూ.23.76 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ ప్రతాప శివ కిషోర్