ఏలూరు (టూటౌన్): చింతలపూడి మండలం బట్టువారిగూడెం గ్రామం విష్ణు సాగర్రోడ్డులో దళిత మహిళ పాము రాణిసాగు చేసుకునే భూమిని ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్ కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి అదనపు విశ్వేశ్వరరావు ని కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి ప్రకాష్ మాట్లాడుతూ సర్వే నంబర్ 1373/1 కి చెందిన మెట్ట భూమి 2.55 ఎకరాల భూమిని అగ్రవర్ణానికి చెందిన కంభం మెట్టు ఉషశ్రీ తన భర్త శ్యామసుందర్, ఆమె బంధువులు ఆమె తీసుకొచ్చిన కొంతమంది దళారులు కూలీలతో దౌర్జన్యంగా భూమిలోకి చొరబడి నారు పాము రాణిపై ఆమె భర్త పై కులం పేరుతో దూషణకు పాల్పడి వారిని కింద పడేసి కొట్టారన్నారు. దళిత మహిళ నారపాము రాణి జీవనాధారమైన మెట్ట సాగు భూమినే సుమారు 70 సంవత్సరాల నుండి ఆమె పూర్వికులు నుండి ఇప్పటివరకు సాగు చేసుకుని జీవిస్తున్నారు. సదరు భూమిలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ బావి, బోరు ఏర్పాటు చేశారు. ఈ ఆక్రమణపై స్పందించిన డీఆర్ఓ విచారణ నిమిత్తం నూజివీడు ఆర్డీఓకు ఎండార్స్ చేసినట్లు రవిప్రకాష్ తెలిపారు.