
ఉగ్ర దాడిపై నిరసన
చింతలపూడి: జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని చింతలపూడి పట్టణ జామియా మసీదు కమిటీ, పట్టణ జమాతే ఇస్లామీ హింద్ నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం జామియా మసీదు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ రహీమ్ (బాబు) మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతుందని, కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి ఉంటున్నారన్నారు. దేశంలో మత సామరస్యాన్ని చూసి ఓర్వలేక ఉగ్ర మూకలు పాశవికంగా కాల్పులు జరపడం పిరికి పంద చర్య అని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమాత్ ఇస్లామీ హింద్ పెద్దలు ఎండీ అక్బర్ అలీ మాట్లాడుతూ ఇస్లాం అంటేనే శాంతి అని, ఇస్లాంలో హింసకు తావు లేదన్నారు, ఎవరెన్ని కుట్రలు, దాడులు చేసినా దేశంలో మతసామరస్యాన్ని విడదీయలేరన్నారు. మసీదు కమిటీ కార్యదర్శి ఎండీ జిలానీ, కమిటీ ముఖ్య కార్యవర్గ సభ్యులు ఎండీ ఇస్మాయిల్, సయ్యద్ రజాక్, టజు సుభాని తదితరులు పాల్గొన్నారు.