
ఆస్పత్రి ప్రారంభమెప్పుడో?
నూజివీడు: జిల్లాలోనే అతిపెద్ద కాలనీగా పేర్గాంచిన నూజివీడు ఎమ్మార్ అప్పారావు కాలనీలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.80 లక్షలతో చేపట్టిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు పూర్తయి ఆరు నెలలు గడిచింది. అయినా ఇప్పటికీ అధికారులు ఈ కేంద్రాన్ని ప్రారంభించలేదు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కృషితో కాలనీలో ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రారంభానికి నోచుకోకపోవడంతో కాలనీ వాసులు చిన్నపాటి అనారోగ్యానికీ ఐదు కిలోమీటర్ల దూరంలోని ఏరియా ఆస్పత్రికి పరుగులు తీయాల్సి వస్తోంది. ఆస్పత్రి ప్రారంభమైతే వైద్య సేవలతో పాటు పది పడకలు అందుబాటులో వస్తాయి. అన్ని రకాల రక్తపరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్య కేంద్రంలో ఫార్మసీ, ఔట్పేషెంట్ గదులు, రెండు శస్త్రచికిత్స గదులు, లాబోరేటరీ, రోగుల సహాయకులకు విశ్రాంతి గదులు, వైద్యుల గది ఉన్నాయి. ఆస్పత్రికి అవసరమైన వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లను సైతం గతంలోనే ప్రభుత్వం నియమించింది.
మీ కోసంలో వినతి
ఆస్పత్రిని ప్రారంభించాలని కాలనీవాసులు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో అర్జీని సైతం అందజేశారు. మున్సిపల్ అధికారులు వైద్యారోగ్య శాఖకు భవనాన్ని అప్పగించలేదని, అప్పగిస్తే ప్రారంభిస్తామని డీఎంహెచ్ఓ కార్యాలయం అర్జీదారుడికి సమాధానం కూడా పంపించింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఆస్పత్రి అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది.
వెంటనే ప్రారంభించాలి
భవన నిర్మాణం పూర్త యినందున ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి. పేదలైన కాలనీవాసులంతా చిన్నపాటి అనారోగ్యానికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిని ఎప్పుడు ప్రారంభిస్తారని ఎదురుచూస్తున్నారు.
– షేక్ రజియాబేగం, కౌన్సిలర్, ఎమ్మార్ అప్పారావు కాలనీ, నూజివీడు.
నిర్మాణం పూర్తయి 6 నెలలు
పట్టించుకోని అధికారులు
గత ప్రభుత్వంలో రూ.80 లక్షలతో నిర్మాణం

ఆస్పత్రి ప్రారంభమెప్పుడో?