
టీం వర్క్తో పనిచేయాలి
ఏలూరు(మెట్రో): అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలు సాధించడానికి అధికారులంతా టీం వర్క్తో పనిచేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ల్యాండ్ అసైన్మెంట్ ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలిసి పనిచేయడం ద్వారా సమస్యలకు మరింత సమగ్ర పరిష్కారాలు కనుగొనవచ్చన్నారు. టీం వర్క్ ద్వారా పనులు వేగంగా, సమర్ధవంతంగా పూర్తవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లాను ఐదో స్ధానం నుంచి మూడో స్ధానానికి తీసుకురావాలన్నారు. ల్యాండ్ అసైన్మెంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రణాళిక బద్ధంగా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్ధితులు కల్పించాలన్నారు. దీపం పథకం మొదటి దశలో సబ్సిడీ అందించామని, రెండో దశలో కూడా అందించడంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు సమీక్షించాలన్నారు. హౌసింగ్ విషయంలో కూడా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలన్నారు. త్వరలో రూ.9,407 కోట్లతో తల్లికి వందనం అమలు చేయబోతున్నామన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం వర్తింప చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో మౌలిక సదుపాయాల పనులకు ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించాలన్నారు. రెవెన్యూ సమస్యలు తలెత్తకుండా తహసీల్దార్లు తమ స్ధాయిలో స్పందిస్తే కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల వరకు రావని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.