
ఆ ఊరంతా నారసింహులే..
నంబర్తో
పిలిచేవారు
మా గ్రామంలో హైస్కూల్ లేకపోవడంతో రాజవరంలోని పాఠశాలకు వెళ్లి చదువుకునే వాళ్లం. మా గ్రామం నుంచి వెళ్లిన వారిలో ఎక్కువ మంది నరసింహమూర్తి పేరుగల వారం ఉండేవారం. దాంతో ఉపాధ్యాయులు ఒకటి, రెండు, మూడు ఇలా పది మందికి నంబర్లు పెట్టారు. అటెండెన్స్ వేసేటప్పుడు కూడా ఒకటి గాడు వచ్చాడా.. రెండు గాడు వచ్చాడా.. అని పిలిచేవారు. నా నంబర్ ఏడు కాబట్టి నన్ను ఏడు గాడు వచ్చాడా అని పిలిచేవారు.
– పసుపులేటి నరసింహమూర్తి
ఆనవాయితీగా మారింది
లక్ష్మీనరసింహ స్వామివారి పేరును పిల్లలకు పెట్టడం ఈ గ్రామంలో ఆనవాయితీగా మారింది. ఆ క్రమంలోనే నా తల్లిదండ్రులు నాకు నరసమ్మ అని పేరు పెట్టారు. లక్ష్మీనరసింహ స్వామివారిపై ఉన్న భక్తి, నమ్మకంతో ఆయన పేరును నామకరణం చేస్తున్నారు. ఆ స్వామి పేరులోనే ఏదో మహత్యం ఉంది.
– బోయిన నరసమ్మ
నా మనుమరాలికి కూడా స్వామి పేరే పెడతా..
నా తండ్రి పేరు నరసయ్య, నా భార్య పేరు లక్ష్మీ నరసమ్మ, నా కుమార్తె పేరు నాగవెంకట నరసమ్మ. నా మనుమరాలికి మరి కొద్దిరోజుల్లో పేరు పెట్టాల్సి ఉంది. ఆమె పేరు కూడా స్వామివారి పేరే పెడతాను. నా పేరుగల వారు ఎక్కువ మంది ఉండటంతో గ్రామంలో నన్ను ఒకటి గాడు అని పిలుస్తారు.
– ముత్తింటి నరసింహమూర్తి
ద్వారకాతిరుమల: ఆ ఊరిలో వెలసిన నారసింహుడంటే వారికెంతో నమ్మకం. ఆ ఊరిలో మగబిడ్డ పుట్టినా.. ఆడ బిడ్డ పుట్టినా.. ఆ స్వామివారి పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ ఊరిలో ఏ గడప తొక్కినా.. నరసింహ, నరసయ్య, నరసింహమూర్తి, నరసింహస్వామి, లక్ష్మీనరసమ్మ, నరసమ్మ వంటి పేర్లే వినిపిస్తాయి. ఇప్పటికే నరసింహమూర్తి పేరుగల వారు ఎక్కువ మంది ఉండటంతో కొంత మందిని నంబర్లతో పిలుస్తున్నారు. ఇదే ఈ ఊరి ప్రత్యేకత. ఇక్కడ ఏ ఇంట శుభకార్యం జరగాలన్నా ముందు ఆ స్వామిని దర్శించి, పూజలు జరుపుకుంటారు. ఆ తరువాతే అడుగు ముందుకు వేస్తారు. ఎన్నికల సమయాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ ఊరి నుంచే ప్రచారాలను మొదలు పెడతారు. ఎందుకంటే ఈశాన్యం మూల ఉన్న ఊరు ఇది.. అందులోనూ నారసింహుని సన్నిధి నుంచి ప్రచారం మొదలు పెడితే ఇక తిరుగు ఉండదన్న నమ్మకం వారిది. అందరికీ అంత సెంటిమెంట్ ఆ స్వామివారంటే. ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురం గ్రామం నారసింహుని క్షేత్రంగా విరాజిల్లుతోంది. సుమారు వెయ్యి మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో, రెండు వందల మందికి పైగా స్వామివారి పేరుగల వారు ఉన్నారంటే అతిశయోక్తికాదు.
నామకరణం వెనుక చరిత్ర ఇదీ..
సుమారు వందేళ్ల క్రితం అప్పటి ఠాణేదారు అయిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొచ్చర్లకోట రామారావు, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెంది గూడూరు అయ్యన్న, బెల్లన్న అరణ్యప్రాంతమైన ఈ మార్గం గుండా వెళుతున్నారు. కొందరు పశువుల కాపర్లు కొండపైన ఏదో ఉందని, అప్పుడప్పుడు పశువుల కోసం కూత వేస్తుంటే తిరిగి కూత వినిపిస్తోందని వారికి చెప్పారు. దాంతో వారు డొంకలు నరుక్కుంటూ కొండపైకి చేరుకుని అక్కడ స్వయంభూ నరసింహ స్వామిని గుర్తించి పాల పొంగలిచేసి స్వామివారికి నివేదించారు. ఆ వెంటనే మండు వేసవి రోజున వర్షం కురిసింది. దాంతో స్వామివారు ఎంతో మహిమాన్వితుడని రామారావు నమ్మారు. తనకు సంతానం లేకపోవడంతో స్వామివారిని మొక్కుకున్నారు. దాంతో ఆయనకు కలిగిన మొదటి సంతానమైన కుమారుడికి స్వామివారి పేరు పెట్టుకుని, ఇలవేల్పుగా కొలిచారు. ఆ తర్వాత ఆయన మనుమడికి సైతం కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆయనే గురూజీగా ప్రతి ఏటా శివరాత్రి నాడు ఈ నారసింహుని క్షేత్రంలో మహా యజ్ఞాన్ని నిర్వహిస్తూ, స్వామివారి కీర్తిని చాటుతున్నారు.
తికమక పడకుండా
నరసింహమూర్తి పేరుగల వారు ఎక్కువ మంది ఉండటంతో పిలిచేవారు అలాగే పలికేవారు తికమక పడేవారట. దాంతో వారు చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులు కొంత మంది నరసింహమూర్తులకు నంబర్లు పెట్టారు. ఒకటి గాడు, రెండు గాడు, మూడు గాడు ఇలా పది నంబర్ల వరకు పెట్టారు. క్లాస్కి వచ్చే ఉపాధ్యాయులు ఏరా.. ఒకటి గాడు వచ్చాడా.. రెండు గాడు వచ్చాడా.. అని పిలిచేవారట. ఇప్పటికీ గ్రామంలో వారిని ఆ నంబర్లతోనే పిలుస్తుండటం విశేషం.
పుట్టిన ప్రతి బిడ్డకూ నరసింహ నామకరణం
నరసింహమూర్తి, నరసమ్మల పేర్లే అధికం
ఒకే పేరుతో ఎక్కువ మంది ఉండటంతో నంబర్లతో పిలుపు
ఐఎస్ జగన్నాధపురంలో అదే ప్రత్యేకత
లక్ష్మీనరసింహ స్వామివారే ఆ గ్రామ ప్రజల ఆరాధ్య ధైవం
ప్రతి ఇంట్లోనూ నారసింహుని పేరుతో..
నా పేరు పసుపులేటి నరసింహమూర్తి. నా కుమార్తెకు కూడా నరసమ్మ అని పేరుపెట్టాను. ఆ లక్ష్మీనరసింహ స్వామివారిని మదినిండా నింపుకున్నాం. అందుకే మా గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ నారసింహుని పేరుగల వారు ఉంటారు.
– పసుపులేటి నరసింహమూర్తి
ఎక్కడా ఇలా లేదు
ఎన్నో గ్రామాల్లో క్షేత్రాలు ఉన్నాయి. కానీ ఎక్కడా దేవుళ్ల పేరును ఇంతిలా పెట్టుకున్న వారు లేరు. నరసింహమూర్తి అనే పేరు ఎంత మందికి ఉన్నా.. ఇంకా పుడుతున్న బిడ్డలకు ఆ పేరునే పెట్టుకుంటున్నారంటే ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొందరు ఆడపిల్లలకు నర్సవేణి, నకవల్లి పేర్లు కూడా పెడుతున్నారు. అందుకే ఈ గ్రామ ప్రజలపై స్వామివారి కృపా కటాక్షాలు ఉంటున్నాయి.
– కోడూరి ఈశ్వర శర్మ, లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు

ఆ ఊరంతా నారసింహులే..

ఆ ఊరంతా నారసింహులే..

ఆ ఊరంతా నారసింహులే..

ఆ ఊరంతా నారసింహులే..

ఆ ఊరంతా నారసింహులే..

ఆ ఊరంతా నారసింహులే..

ఆ ఊరంతా నారసింహులే..

ఆ ఊరంతా నారసింహులే..

ఆ ఊరంతా నారసింహులే..