రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఈ విద్యా సంవత్సరంలో రెండో విడత అడ్మిషన్లకు పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియెట్ ఫెయిలైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ సీహెచ్ సునీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ధ్రువపత్రాలతో హెచ్టీటీపీఎస్://ఐటీఐఅడ్మిషన్స్.ఏపీ.జీఓవీ.ఇన్/ఐటీఐ/ వైబ్ సైట్ ద్వారా వచ్చే నెల మూడో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐని సంప్రదించాలని సునీల్ కుమార్ సూచించారు.
పంట బీమాపై
అవగాహన కల్పించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట బీమా చేయించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.
చిన్న పరిశ్రమల స్థాపనకు
వేగంగా అనుమతులివ్వాలి
రాజమహేంద్రవరం సిటీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు అనుమతుల ప్రక్రియను సరళతరం, వేగవంతం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. కడియం ప్రాంతంలో లభించే బంతి, చామంతి వంటి పువ్వులను ఉపయోగించుకుని సుగంధద్రవ్యాల పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టాలని సూచించారు.
పుష్కరాలు జరిగే గ్రామాలకు
ఈ–వాహనాలు
రాజమహేంద్రవరం రూరల్: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరిగే జిల్లాలోని 33 గ్రామ పంచాయతీలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం 40 ఈ–వాహనాలు అందజేసింది. గోపాలపురం నియోజకవర్గంలోని గ్రామాలకు మరో 6 ఈ–వాహనాలను మంజూరు చేశారు. త్వరలోనే వీటిని ప్రారంభించనున్నారు.
జీఓ–396 వెంటనే
ఉపసంహరించుకోవాలి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు జారీ చేసిన జీఓ–396ను వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జిల్లా, రాజమహేంద్రవరం దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యాన లేఖర్లు, వారి సహాయకులు చేస్తున్న పెన్డౌన్ నిరసన గురువారం నాలుగో రోజుకు చేరింది. పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కూడా నిరసన కొనసాగింది.
రేపటి నుంచి ఆర్టీసీ
ప్రమాద రహిత వారోత్సవాలు
రాజమహేంద్రవరం సిటీ: ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ఏపీఎస్ ఆర్టీసీలో ప్రమాద రహిత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) వైఎస్ఎన్ మూర్తి గురువారం తెలిపారు. వాహనం నడిపే సమయంలో ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగం వంటి ప్రమాదకర అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. వారోత్సవాల సందర్భంగా అన్ని డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు, సాంకేతిక సిబ్బందికి రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతులు, కౌన్సెలింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు
కోరుకొండ బస్టాండ్
రోడ్డుకు మరమ్మతులు
కోరుకొండ: వర్షం కురిస్తే కోరుకొండ బస్టాండ్ సెంటర్ నీట మునుగుతున్న సమస్యపై ‘చిను కు పడితే చిత్తడే’ శీర్షికన ‘సాక్షి’ గురువారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. జాతీయ రహదారి 516–ఇ, బస్టాండ్ పరిసరాల్లో పంచాయతీ కార్యదర్శి నాగరత్నం గ్రావెల్, చట్రు వేయించి, మరమ్మతులు చేయించారు. సమీపంలోని గోతులను పూడ్చారు. దీంతో, ఆ ప్రాంతంలోని వర్షపు నీరంతా బయటకు పోయి, వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది.


