అనపర్తి: జి.మామిడాడ సూర్యనారాయణమూర్తి ఆలయానికి సుమా రు రూ.2కోట్ల విరాళాలిచ్చిన దాత, దివంగత మాజీ సర్పంచ్ చింతపండు అమ్మిరెడ్డి పేరును శిలాఫలకంపై నుంచి తొలగించడం పైశాచికమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత దౌర్జన్యాలు, దాడులు తీవ్రతరమయ్యాయని ఆరోపించారు. సూర్యనారాయణస్వామి వారికి అమ్మిరెడ్డి సుమారు రూ.1.50 కోట్ల బంగారు కిరీటం సమర్పించారని గుర్తు చేశారు. ఆయ న మరణానంతరం సోదరుడు వెంకటరెడ్డి 2018లో సుమారు రూ.6.50 లక్షలతో ఆలయ ముఖద్వారంపై అశ్వాలతో కూడిన సూర్యనారాయణమూర్తి విగ్రహం ఏర్పాటు చేయించారని, శిథిలావస్థకు చేరిన ధ్వజస్తంభానికి రూ.10 లక్షల విరాళం ఇచ్చారని చెప్పారు. ఇవ న్నీ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరగగా వైఎస్సార్ సీపీ హయాంలోనే జరిగాయంటూ అబద్ధా లు చెబుతున్నారని సూర్యనారాయణరెడ్డి దుయ్యబట్టారు. శిలాఫలకాలపై ఆ రోజు అభ్యంతరం చెప్పని రామకృష్ణారెడ్డి, వాటిని అర్ధరాత్రి దొంగచాటుగా ధ్వంసం చేయించడం దుర్మార్గమని విమర్శించారు. ఆయ నకు నిజంగా సంబంధం లేకపోతే, శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, దానిని యథాతథంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.


