● జనసేన నేతలకు మాజీ ఎమ్మెల్యే
జక్కంపూడి రాజా హెచ్చరిక
● పదవుల కోసం క్యారెక్టర్ను తగ్గించుకోవద్దని మంత్రి దుర్గేష్కు హితవు
రాజమహేంద్రవరం సిటీ: జనసేన పార్టీ ఎమ్మెల్యేలు హద్దులు దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మంత్రి కందుల దుర్గేష్ కాపు నేతలపైన, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన హద్దులు దాటి మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. రోజురోజుకీ భాష ఎక్కడికో వెళుతోందని, సమాజానికి ఏ రకమైన సందేశం ఇస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీలో ఉన్న కాపు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ హోదాల్లో పార్టీ ముఖ్య నేతలు సమావేశమైతే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్నారు. కాపులకు ఉపయోగపడాలని సమావేశం పెడితే దానిపైనా చిల్లర వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాజకీయాల్లో వాడే భాష హుందాగా ఉండాలని, టీడీపీ వాళ్లను ఆదర్శంగా తీసుకుని దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తోందని చెప్పా రు. వైఎస్ జగన్ మాదిరిగా పవన్కళ్యాణ్లో పోరాట పటిమ ఉంటే ఇప్పటికే జనసేన కూడా బలమైన శక్తిగా ఎదిగేదన్నారు. రాజకీయ శక్తిగా ఎదగడం మానేసి.. ‘మరో 15 ఏళ్లు చంద్రబాబుకు ఊడిగం చేస్తాం. జెండా కూలీలుగా పనిచేస్తాం. మళ్లీ కాపులకు చెవిలో పువ్వులు పెడదాం’ అనుకోవడం జనసేన నేతలకు అలవాటైపోయిందన్నారు.


