రాజవొమ్మంగి: మండలంలోని అప్పలరాజుపేట సమీపాన ఏపీ ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) పెంచుతున్న యూకలిప్టస్ వనాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. పులి మెడలోని ట్రాకర్ ద్వారా అందిన శాటిలైట్ సమాచారాన్ని బట్టి శనివారం వేకువజామున 5 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటలకు యూకలిప్టస్ వనాల్లో పులి సంచరించిందని స్థానిక అటవీ క్షేత్రాధికారి ఉషారాణి తెలిపారు. తోటి అధికారులు, సిబ్బందితో పాటు పరిశీలించగా.. ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు స్పష్టంగా కనిపించాయని ‘సాక్షి’కి చెప్పారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా అడవికి వెళ్లరాదంటూ అప్పలరాజుపేట, పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు. అడవిలోనికి పశువులను మేతకు తీసుకుని వెళ్లవద్దని ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. ఫారెస్టు సెక్షన్ అధికారి భవాని, బీట్ అధికారులు సూర్యప్రసాద్, ఆనంద్, బేస్ క్యాంపు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


