ఫ రాజమహేంద్రవరంలో వేసవి క్రీడా శిక్షణ
ఫ ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థినులు
ప్రకాశంనగర్ (రాజమహేంద్రవరం): బాలికలు బ్యాట్ పట్టారు.. చదువులో కుస్తీ పట్టిన వారంతా సెలవుల్లో శిక్షణకు ఉత్సాహంగా వచ్చారు.. మహిళా క్రికెట్ జట్టులో తమ సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాజమహేంద్రవరం ఉమెన్స్ సబ్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక సీజీటీఎం కళాశాల క్రీడా మైదానంలో క్రికెట్ కోచ్ ఎంఏ హాకీం ఫాషా విద్యార్థినులకు ఉచితంగా క్రికెట్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో సుమారు 42 మంది శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన శిక్షణ 31 వరకూ కొనసాగనుంది. అండర్– 12, 15, 19, సీనియర్స్ విభాగంలో ఉదయం 6 నుంచి 9 వరకూ, సాయంత్రం 4 నుంచి 6 వరకూ రెండు విడతలుగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే కోచ్ ఫాషా వద్ద క్రికెట్లో శిక్షణ తీసుకున్న విద్యార్థినుల్లో అండర్ – 19 విభాగంలో 8 మంది జాతీయ స్థాయి, అండర్– 19 రాష్ట్ర స్థాయిలో ఒకరు, అండర్– 23 రాష్ట్ర స్థాయిలో ఒకరు సత్తా చాటారు.
క్రికెట్పై అభిమానంతో..
నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ క్రీడలో శిక్షణ తీసుకుంటున్నా. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ వంటి అన్ని అంశాల్లో మెలకువలు నేర్చుకుంటున్నా. ముఖ్యంగా క్రికెట్లో ఏకాగ్రత, క్రమఽశిక్షణ, సమయపాలన వంటి అంశాలు ఎంతో ముఖ్యం. –జి.రాగదీపికశ్రీ, ఎనిమిదో తరగతి
అదే లక్ష్యంతో శిక్షణ
క్రికెట్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నమెంట్లలో ఆడాలనే లక్ష్యంతో శిక్షణ తీసుకుంటున్నా. కోచ్ ఎంఏ హాకీం ఫాషా చక్కని టెక్నిక్స్ నేర్పుతున్నారు. ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
–ఆర్.అమృత వర్షిణి
భవిష్యత్కు ఉపయోగం
క్రికెట్లో ఉచిత శిక్షణ ఇవ్వడం బాగుంది. వేసవి సెలవుల్లో ఇటువంటి ఆటలు నేర్చుకోవడం వల్ల నైపుణ్యం చాటవచ్చు. ఇలా రాణిస్తే ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాలో ఉపయోగకరంగా ఉంటుంది.
–ముదురున్నీసా మహ్మద్, 7వ తరగతి


