గోకవరం: మండలంలోని రామన్నపాలెం శివారున ప్రధాన రహదారిపై కారు బోల్తా పడిన ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాల ప్రకారం.. కిర్లంపూడి మండలం రమణయ్యపేటకు చెందిన ఐదుగురు వ్యక్తులు కారుపై భద్రాచలం వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో రామన్నపాలెం వచ్చేసరికి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారు రెండు పల్టీలు కొట్టి చెట్టును ఢీకొని ఆగింది. వెంటనే స్థానికులు కారు నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. కారులో ప్రయాణిస్తున్న ఎ.అర్జున్, కె.చిన్న, సాంబమూర్తి, బి.శ్రీను, డి.నారాయణలు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఆంజనేయస్వామి మాల ధరించి ఉన్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను కులం పేరుతో దూషించిన భర్త అరెస్ట్
భార్యను కులం పేరుతో దూషించిన కేసులో భర్తను అరెస్ట్ చేసినట్టు గోకవరం ఎస్సై పవన్కుమార్ శనివారం తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. గోపాలపురం గ్రామానికి చెందిన గూడవల్లి వీరప్రసాద్, ధరణిలు ఆరేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఎనిమిది నెలల కుమారుడు ఉన్నాడు. ఇటీవల వీరప్రసాద్ తన భార్యను తరచూ కులం పేరుతో దూషించి వేధిస్తున్నాడు. ఈ మేరకు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తపై అట్రాసిటీ కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం కోర్టుకు తరలించారు.


