అమలాపురం రూరల్: 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాలురు, బాలికల జూనియర్ మెన్ అండ్ ఉమెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు అమలాపురంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్లో ప్రారంభించారు. ఈ పోటీలు ఆరు రోజు పాటు కొనసాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
దేశంలోని 25 రాష్ట్రాల నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ బాలయోగి మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకొని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ ప్రతిభావంతులైన క్రీడాకారులు క్రీడా కోటాలో ఉద్యోగ అవకాశాలు సాధించుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు అవసరమన్నారు. పవర్ లిఫ్టింగ్ ఇండియా ఫెడరేషన్ చాంపియనన్ షిప్ సెక్రటరీ రాజేష్ ఎస్ గొయల్ మాట్లాడుతూ కోనసీమలో ఈ పోటీలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. శనివారం ఉదయం నుంచి పోటీలు జరుగుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఉపాధ్యక్షుడు మద్ది ప్రభాకరరావు, కల్వకొలను తాతాజీ, చిక్కాల గణేష్, నల్లా పవన్, మోకా సుబ్బారావు, ఏడిద శ్రీను, యనుముల కృష్ణ పద్మరాజు, సౌత్ జోన్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు, ఏపీ అధ్యక్షుడు గంటా వెంకటేశ్వర్లు, సకల సూర్యనారాయణ, గారపాటి చంద్రశేఖర్, పప్పుల శ్రీరామ చంద్రమూర్తి, దొమ్మేటి వెంకటరమణ పాల్గొన్నారు.


