బాలాజీచెరువు (కాకినాడ): ఒకప్పుడు వేసవి సెలవులు అంటే ఆటలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం విద్యార్థులు గ్రంథాలయాలకు వచ్చి తమకు ఇష్టమైన పుస్తకాలు చదువుతున్నారు. అలాగే అక్కడ వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు గత నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కాగా, వీటికి ఆదరణ లభిస్తుంది. కాకినాడ నగరంలోని గ్రంథాలయాల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ వివిధ అంశాల్లో నిపుణులతో తరగతులు బోధిస్తున్నారు. నృత్యం తదితర వాటిపై శిక్షణ ఇస్తున్నారు. స్థానిక జిల్లా ప్రధాన గ్రంథాలయంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో ఏఎంజీ స్కూల్ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎం.చినబాబు పక్షులు, జంతువులు వంటి చిత్రాలు గీసి విద్యార్థులకు వివరించారు. గాంధీనగర్ గ్రంథాలయంలో ఉపాధ్యాయుడు పురాలశెట్టి వీరబాబు డ్రాయింగ్, క్రాఫ్ట్ అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ శిబిరాన్ని డిప్యూటీ లైబ్రేరియర్ కిషోర్, గాంధీనగర్ గ్రంథాలయాల అధికారి ములంపాక శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు.


