
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది సమయ పాలన కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర వైద్యశాలను సోమవారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఐసోలేషన్ వార్డును పరిశీలించిన అనంతరం మాతా శిశు సంరక్షణ వార్డు, క్రిటికల్ కేర్ బ్లాక్ పనుల పురోగతిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.లక్ష్మీ సూర్యప్రభను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఐసోలేషన్ వార్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు.
మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వార్డును తగిన వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మాతా శిశు ఆరోగ్య బ్లాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గత సమావేశంలోనే స్పష్టం చేశామని గుర్తు చేశారు. 15 రోజుల్లో ఈ బ్లాక్ ద్వారా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ బోధన ఆసుపత్రికి అనుసంధానంగా క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించే విధంగా పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వివిధ వైద్య సేవలు, మానవ వనరుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అర్జీల పరిష్కారం
అసంబద్ధంగా ఉంటే చర్యలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజల అర్జీల పరిష్కారంలో అసంబద్ధంగా ఎండార్స్మెంట్ ఇవ్వడం సరికాదని, అలా చేసినట్లు గమనిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి పలువురు జిల్లా అధికారులతో కలిసి ఆమె అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి, అర్జీల పరిష్కారంపై ఆదేశాలు జారీ చేశారు. పీజీఆర్ఎస్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వస్తున్న అర్జీలు స్వీకరించి, తగిన పరిష్కారం చూపాలని అన్నారు. ఏదో ఒక సమాధానం ఇస్తే పరిష్కరించినట్లు కాదని స్పష్టం చేశారు. ఇదే తీరు పునరావృతమైతే ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతురాలు మల్లిం వెంకటేశ్వరికి ఉమా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యాన జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా మంజూరైన రూ.8,500 విలువ చేసే వీల్ చైర్ను జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అందజేశారు.
పోలీస్ పీజీఆర్ఎస్కు 30 అర్జీలు
రాజమహేంద్రవరం రూరల్: తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఎస్పీ డి.నరసింహ కిషోర్ ప్రజల నుంచి 30 అర్జీలు స్వీకరించారు. సివిల్, చీటింగ్, కొట్లాట, దొంగతనం, కుటుంబ సమస్యలు తదితర కేసులకు సంబంధించి ప్రజలు ఫిర్యాదులు చేశారు. వారి సమస్యలను ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకుని, సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాధితులకు చట్ట పరిధిలో, నిర్దేశిత సమయంలో సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎన్బీఎం మురళీకృష్ణ (అడ్మిన్), ఏవీ సుబ్బరాజు (శాంతిభద్రతలు) తదితరులు పాల్గొన్నారు.

వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి

వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి