నాలుగున్నర కేజీల సరకు స్వాధీనం
రాజోలు: చెడు వ్యసనాలు, మద్యానికి బానిసైన ఏడుగురు యువకులు గంజాయి విక్రయానికి పాల్పడి సఖినేటిపల్లి పోలీసులకు చిక్కారు. స్థానిక సీఐ కార్యాలయంలో సీఐ బి.సురేష్బాబు, ఎస్సై కె.దుర్గ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన కొపనాతి దుర్గాప్రసాద్ అనే రింటు, మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికు చెందిన రాయుడు యశ్వంత్, సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామానికి చెందిన కొల్లాటి ధర్మరాజు అనే ధర్మ, కేశవదాసుపాలేనికి చెందిన చెల్లుబోయిన భగవాన్ అనే చింటూ, ఉయ్యూరి వారి మెరక కంతేటి వారి పోడు గ్రామానికి చెందిన కడలి ప్రదీప్కుమార్ అనే పాండు, అదే గ్రామానికి చెందిన మత్తి ఆనంద్కుమార్, కేశవదాసుపాలానికి చెందిన కడలి హర్షవర్ధన్లను బుధవారం అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. నర్సీపట్టణంలోని గుర్తుతెలియని వ్యక్తుల వద్ద నుంచి దుర్గాప్రసాద్ గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించే ఉద్దేశంతో మిగిలిన స్నేహితులతో కలసి అంతర్వేది దేవస్థానం గ్రామంలోని బీచ్ వద్ద ఈ నెల 21న చిన్న పొట్లాలుగా కడుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని 4.690 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ధర్మరాజు, యశ్వంత్, కిరణ్రాజు గత నెల 25న మోరిపోడులోని రంపాలమ్మ గుడి సమీపంలో గంజాయి, మద్యం సేవించి వి.వి.మెరక, కె.వి.పోడు ప్రాంతాల్లో ఇళ్లపై రాళ్లు విసరడం, కోళ్ల దొంగతనాలు చేసి బీభత్సం సృష్టించారు. అలాగే స్థానికంగా డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ బొమ్మతో ఉన్న శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి వారిని అరెస్టు చేసిన అరెస్టు చేసిన సీఐ సురేష్బాబు, ఎస్సై కె.దుర్గ శ్రీనివాసరావులను ఎస్పీ, డీఎస్పీలు అభినందించారు.
మహిళ మృతి కేసులో 13 ఏళ్ల జైలు
ఇద్దరు దోషులకు కోర్టు తీర్పు
యానాం: పట్టణ పరిధిలో 2011లో జరిగిన ఓ మహిళ అనుమానాస్పద మృతికి సంబంధించి కేసులో విచారణ అనంతరం బుధవారం ఇద్దరికి 13 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే యానాంకు చెందిన ఓలేటి సత్యవతి 2011 మే 9వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పటి నుంచి పుదుచ్చేరి మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో పట్టణ పరిధిలో ఫడ్బ్యాంకు రోడ్డు, ఉదయకృష్ణ కాలనీ, దరియాలతిప్పకు చెందిన ఎ1 చెక్క శ్రీనివాసు, ఎ2 బలసాడి వెంకటేశ్వర్లును దోషులుగా నిర్ధారిస్తూ 3వ అదనపు జిల్లా న్యాయస్థానం పై విధంగా తీర్పు ఇచ్చింది. దానితో పాటు ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున జరిమానా విధించినట్టు సీఐ డి.సురేష్బాబు తెలిపారు.


