అమలాపురం రూరల్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ జిల్లాలోని గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. గ్రామ పంచాయతీలు గ్రేడ్లుగా మారిన నేపథ్యంలో తమ సేవలకు ప్రాధాన్యత కల్పించి అర్హత, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తమ జీతాలను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా చెల్లించే విధానం అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ వంటి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. ఈ మేరకు జేసీకి వైఖోం నైదియాదేవికి వారి సంఘ జిల్లా అధ్యక్షుడు గండ్రు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి వేమలరావు, ఉపాధ్యక్షుడు మోరం నాయుడు, గుత్తుల భైరవస్వామి, దాసరి రాజు, కోలం నాగ బాబు తదితరులు వినతిపత్రం అందించారు.


