బ్రెయిలీ నాణేల సేకరణలో అవార్డు
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన అంధురాలు, వాకర్స్ జోన్ చైర్పర్సన్ పుత్సా రాజేశ్వరి నాణేల సేకరణలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ –2026 సొంతం చేసుకున్నారు. లూయిస్ బ్రెయిలీ నాణేల సేకరణలో ఈ అవార్డుకు అర్హత సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా బెల్జియం, బ్రెజిల్, ఈక్వెడార్, ఐల్ ఆఫ్ మ్యాన్, ఇటలీ, పోలెండ్, థాయ్లాండ్, అమెరికా దేశాలతో పాటు మన దేశానికి సంబంధించి 2009లో బ్రెయిలీ ముఖ చిత్రంలో విడుదలైన రూ.2, రూ.100తో పాటు మొత్తం పది దేశాలకు చెందిన 14 నాణేలను సేకరించడం ద్వారా ఆమె ఈ రికార్డు పొందారు. రాజేశ్వరి అవార్డు సాధించడం పట్ల వాకర్స్ జిల్లా గవర్నర్ తోలేటి సూర్యనారాయణ, సంస్కార భారతి జిల్లా అధ్యక్షురాలు శ్రీగిరి పద్మావతి, నాణేల సేకరణకర్తలు నడంపల్లి రామరాజు, ఇవటూరి రవి సుబ్రహ్మణ్యం, పి.వెంకటనారాయణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
తనకు వచ్చిన లిమ్కా బుక్ ఆఫ్ అవార్డును చూపుతున్న రాజేశ్వరి
మేడపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
ముమ్మిడివరం: ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మేడపై నుంచి జారిపడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గేదెల్లంకకు చెందిన పితాని బాలకృష్ణ (51) తన అక్కయ్య ఇంటిపై కడుతున్న పిట్టగోడకు ఇటుకలు అందించేందుకు వెళ్లాడు. అక్కడి నుంచి ప్రమాదవశాత్తూ కాలి జారి కిందకు పడిపోయాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. బాలకృష్ణకు భార్య బిందుమాధవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


