క్షణికావేశానికి పసికందు బలి
జగ్గంపేట: ఆ చిన్నారి ఏం చేసిందో.. అమ్మా నాన్న అనడం కూడా రాని ఆ పసి ప్రాయాన్ని కన్న తండ్రే కడతేర్చాడు.. క్షణికావేశంలో కన్న బంధాన్నే మరిచాడు.. మద్యం మత్తులో తీసుకున్న నిర్ణయంతో ఓ చిన్నారి ప్రాణాలను హరించాడు. ఈ సంఘటన అందరి హృదయాలను కలిచివేసింది. జగ్గంపేటలో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. స్థానికులు, జగ్గంపేట ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. జగ్గంపేట టీచర్స్ కాలనీలో ఓడిబోయిన మణికంఠ (23), అతని భార్య ఓడిబోయిన సాయి (25) నివాసం ఉంటున్నారు. వీరిది కులాంతర వివాహం. అయితే సాయికి గతంలోనే వివాహం జరగడం ఆరేళ్ల కూతురు ఉండగా, భర్తతో విడిపోయింది. అనంతరం మణికంఠతో పరిచయం ఏర్పడి వివాహం చేసుకుంది. వీరికి ఆడపిల్ల ఉంది. ఆ పాపకు 11 నెలలు. అయితే భర్త తరచూ మద్యం తాగడం, సంపాదన గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తిరగడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సాయి రెండు రోజుల క్రితం స్థానిక గోకవరం రోడ్డులోని పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం సాయంత్రం మద్యం తాగి అత్తవారింటికి వెళ్లిన మణికంఠ భార్యతో ఘర్షణకు దిగాడు. దీంతో అత్తింటివారు చివాట్లు పెట్టి, నీ కూతురిని తీసుకుని వెళ్లి పోషించుకో అని అనడంతో మద్యం మత్తులో ఉన్న మణికంఠ 11 నెలల చిన్నారితో సహా అక్కడి నుంచి మోటారు సైకిల్పై వచ్చేశాడు. మత్తు దిగిన తరువాత తిరిగి వస్తాడని భావిస్తున్న భార్య, అత్తకు పిడుగులాంటి వార్త తెలిసింది.
మోటారు సైకిల్తో సహా కాలువలోకి..
11 నెలల తన కూతురుతో సహా ఆవేశంగా బయలు దేరిన మణికంఠ, నేరుగా జగ్గంపేట నుంచి గుర్రంపాలెం వెళ్లే రహదారిలో ఉన్న పోలవరం కాలువలోకి మోటారు సైకిల్తో సహా దూసుకుపోయాడు. అయితే పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి తక్షణం కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉంది. మణికంఠను కాపాడి గట్టుపైకి తీసుకువచ్చారు. పోలవరం కాలువకు సమీపంలో ఉన్న వివేకానంద విద్యా సంస్థల అధినేత, రాష్ట్ర వైఎస్సార్ సీపీ నేత ఒమ్మి రఘురామ్కు సమాచారం తెలియడంతో తక్షణం ఆయన సంఘటన స్థలానికి చేరుకుని తన కారులో చిన్నారిని, మణికంఠను జగ్గంపేట సీహెచ్సీకి తీసుకువెళ్లారు. అయితే డాక్టర్లు పరీక్షించి చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
బోరున విలపించిన కుటుంబ సభ్యులు
ఆవేశంగా వెళుతుంటే కొద్ది సేపటికి తిరిగి వస్తాడని భావించానని, కానీ కూతురి ప్రాణాలు తీస్తాడని అనుకోలేదని తల్లి సాయి, ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. స్థానికులు ఆగ్రహంతో మణికంఠకు దేహశుద్ధి చేశారు.
ఫ కూతురితో కాలువలోకి దూకిన తండ్రి
ఫ మద్యం మత్తులో ఘాతుకం
ఫ చిన్నారి మృతి, తండ్రిని రక్షించిన స్థానికులు
ఫ భార్యాభర్తల మధ్య వివాదమే కారణం
క్షణికావేశానికి పసికందు బలి


