చీడ, పీడలు, అకాల వర్షాలు.. అప్పు తీర్చలేక యువరైతు ఆత్మహత్య

Tenant Farmer Commits Suicide in Adilabad District - Sakshi

నెన్నెల (ఆదిలాబాద్‌): కాలం కలిసి రాక వ్యవసాయంలో మిగిలిన అప్పులు గంపెడాశతో సాగు చేసిన పత్తి , అకాల వర్షం, చీడపీడలతో పూర్తిగా దెబ్బతింది. పెట్టుబడికి తెచ్చిన అప్పులు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అప్పు తీర్చే మార్గం లేక చివరికి పత్తి చేనులోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు యువ కౌలు రైతు. వివరాల్లోకి వెళ్తే.. నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకౌలు రైతు సరండ్ల మల్లేష్‌(30) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

రెండు రోజుల క్రితం ఇంటి సమీపంలోని పత్తి చేనులో పురుగుల మందు తాగి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేష్‌ 20  ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని 10 ఎకరాలలో పత్తి, 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. చీడ, పీడలు, అకాల వర్షాలతో కాలం అనుకూలించక దిగుబడి రాలేదు. గతేడాది నష్టపోయిన పంట నష్టాన్ని పూడ్చుకుందామనుకొని గంపెడాశతో పంటను సాగు చేస్తే చివరికి పంట నష్టం ప్రాణాన్ని తీసింది.

చదవండి: (అన్నా.. అని వేడినా కనికరించలేదు.. సోదరిని, తల్లిని సైతం వీడియో తీసి..) 

పంటల పెట్టుబడి కోసం రూ.4 లక్షలు ప్రైవేట్‌ అప్పులు చేశాడు. అవి సరిపోక భార్య ఒంటిమీద నాలుగున్నర తులాల బంగారాన్ని నెన్నెల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కుదవపెట్టి మరో రూ.2 లక్షలు అప్పు తీసుకొని పంటలకు పెట్టుబడి పెట్టాడు. తీరా పంటలు చేతికి వచ్చే సమయానికి అధిక వర్షాలు, తెగుళ్లతో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దిగుబడి రాక అప్పు తీర్చే మార్గం కానరాక మానసికంగా కంగిపోయి ఆందోళన చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. మతుడికి భార్య పద్మ, మూడేళ్ల కొడుకు రిషి ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామా నిర్వహించి దర్యాప్తు చేస్తున్నామని నెన్నెల ఎస్సై సౌమ్య తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top