Sakshi News home page

వివాహేతరం సంబంధం తెలిసి హెచ్చరించాడు.. పసరు కోసం వెళ్తే.. 

Published Fri, Aug 26 2022 2:49 PM

Man Murdered over Extramarital Affair in Kurnool District - Sakshi

సాక్షి, బొమ్మలసత్రం (కర్నూలు): వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది. తన భార్యతో కొనసాగిస్తున్న అక్రమ సంబంధాన్ని మానుకోవాలని చెప్పినా వినకపోవడంతోనే హత్య చేశానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. నాలుగు రోజుల క్రితం లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను గురువారం డీఎస్పీ మహేశ్వరరెడ్డి విలేకరులకు వెల్లడించారు.

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామానికి చెందిన ధర్మారావు కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ధర్మారావు భార్య రమణి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామానికి చెందిన రామ్‌గోపాల్‌రావు (33)తో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భర్త ధర్మారావు ఎన్ని సార్లు మందలించినా తీరు మార్చుకోకపోవడంతో రామ్‌గోపాల్‌రావును ఎలాగైన అంతమొందించాలని ధర్మారావు నిర్ణయించుకున్నాడు.

నిందితున్ని చూపుతున్న డీఎస్పీ మహేశ్వరరెడ్డి

ఈక్రమంలో మద్యం అలవాటును మానుకునేందుకు పసరు తీసుకునే నిమిత్తం రామ్‌గోపాల్‌రావు ఈనెల 21న పాణ్యం మండల కేంద్రానికి వస్తున్నాడని తెలుసుకున్నాడు. తిరిగి వెళ్లే క్రమంలో నంద్యాలకు చేరుకున్న రామ్‌గోపాల్‌రావును బొమ్మలసత్రం వద్ద ఉన్న రైల్వే పట్టాల వద్ద మెడను బిగించి హత్య చేసి పరారయ్యాడు. నాలుగు రోజుల తర్వాత మృతదేహం నుంచి దుర్వాసన రావటంతో స్థానికుల సమాచారం మేరకు తాలూకా పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేశారు.

అదే సమయంలో నాలుగు రోజులైనా భర్త ఇంటికి రాకపోవడంతో మృతుడి భార్య సత్తెనపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో బొమ్మలసత్రం వద్ద లభ్యమైన మృతదేహం రామ్‌గోపాల్‌వర్మదని గుర్తించి ఆరా తీయగా అసలు నిజం బయటపడింది. ధర్మారావు తానే హత్య చేసినట్లు అంగీకరించడంతో నిందితున్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ మురళీమోహన్‌రావు పాల్గొన్నారు. 

చదవండి: (ప్రేమ వివాహం.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. ఆపై)

Advertisement
Advertisement