Crime: ప్రియుని ద్వారా నయం కాని రోగం.. భర్తకు మరో పెళ్లి.. ట్విస్టుల మీద ట్విస్టులు

Husband Attacked On Wife And Lover At Jadcherla - Sakshi

సాక్షి, జడ్చర్ల: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో కలకలం రేపింది. సీఐ రమేశ్‌బాబు కథనం మేరకు వివరాలిలా.. హన్వాడ మండల దాచన్‌పల్లికి చెందిన సంజన్న, శిరీష భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ల క్రితం పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి జరిగింది. పెయింటర్‌గా పనిచేసే సంజన్న, తన భార్యతో హైదరాబాద్‌లో ఉంటున్న క్రమంలో హుజూర్‌నగర్‌కు చెందిన రాంబాబుతో శిరీషకు పరిచయమైంది. రాంబాబు, శిరీషలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

ఈ క్రమంలో ప్రియుడు రాంబాబు ద్వారా శిరీషకు నయంకాని వ్యాధి రావడంతో తన భర్తను దూరం పెడుతూ వచ్చింది. చివరకు విషయాన్ని భర్తకు వివరించి నెల రోజుల క్రితం మరొక యువతితో సంజన్నకు పెళ్లి జరిపించి పెద్దల సమక్షంలో విడిపోయారు. అయితే సంజన్నతో కేవలం వారం రోజులు మాత్రమే ఉన్న రెండో భార్య ఆయనను విడిచివెళ్లిపోయింది. వారం క్రితం మొదటి భార్య శిరీష ప్రియుడు రాంబాబుతో వెళ్లిపోయింది. దీంతో ఒంటరిగా మిగిలిన భర్త సంజన్న తన మొదటి భార్య శిరీషతోనే కలిసి ఉండాలని నిశ్చయించుకొని ఆమెకు ఫోన్‌ చేశాడు.

జడ్చర్లకు రావాలని అక్కడ ముగ్గురం కలిసి మాట్లాడుకుందామని నచ్చజెప్పి జడ్చర్లకు పిలిపించాడు. ఈ క్రమంలో ప్రధాన రహదారిపై నుంచి భార్యను జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో సాయినగర్‌కు వెళ్లే రహదారిపైకి మాట్లాడుకుంటూ తీసుకువచ్చి ఆకస్మికంగా తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. కొంచెం దూరంగా ఉన్న ప్రియుడు రాంబాబు వెంటనే తేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపై కూడా దాడి చేశాడు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న శిరీష, రాంబాబును బాదేపల్లి ప్రభు త్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

ముక్కుకోసి అందవిహీనంగా చేద్దామని..   
రెండో పెళ్లి చేసుకున్న కూడా భార్య విడిచిపోవడంతో ఎలాగైనా తన మొదటి భార్య శిరీషను తాను దక్కించుకోవడానికి నిందితుడు పక్కా స్కెచ్‌ వేసినట్లు తెలిసింది. తనకు భార్య ద్వారా రోగం వచ్చినా ఫర్వాలేదు అనే నిర్ణయానికి వచ్చి తన భార్యతోనే కలిసి ఉండాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కత్తితో ముక్కును కోసి అందవిహీనంగా తయారు చేస్తే తన భార్య తనకు దక్కుతుందని అనుకున్నాడు. అందుకు అనుగుణంగా తన గదిలో ఉండే కూరగాయల కత్తిని వెంట తెచ్చుకున్నాడు. అయితే కత్తితో దాడి చేస్తున్నాడని పసిగట్టిన భార్య శిరీష తప్పించుకునే ప్రయత్నం చేయడంతో తొడ, వీపు భాగాలపై పొడిచాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top