సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరంలో గుండెల్ని పిండేసే ఓ దారుణమైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. భార్యపై ఉన్న కోపం, అనుమానంతో తన కుమార్తెను ఉరి తీసి చంపాడో కిరాతకుడు.
వివరాల్లోకెళ్తే.. నేపాల్కు చెందిన లక్ష్మణన్ ప్రసాద్ చెన్నైలోని చింతాద్రిపేటలో ప్రభుత్వ పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె గీత 4వ తరగతి, చిన్న కుమార్తె 1వ తరగతి చదువుతున్నారు. భార్యపై అనుమానంతో లక్ష్మణన్ తరచూ గొడవ పడడంతో మనస్తాపం చెందిన భార్య తన చిన్న కుమార్తెను తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. పెద్ద కుమార్తె గీతను తన వద్దే ఉంచుకున్నాడు.
సోమవారం రాత్రి సమయంలో తన భార్యకు వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. భార్య, చిన్న కూతురు చూస్తుండగానే.. పెద్ద కుమార్తె గీత మెడకు తాడు బిగించి ఉరితీసి హత్య చేశాడు. వెంటనే తానూ అదే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తాడు తెగిపోవడంతో కిందపడి తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మంగళవారం ఉదయం మరణించాడు.


