తంజావూరులో ఉదయనిధి
తీవ్ర విమర్శలు
కదం తొక్కిన డీఎంకే సేనలు
డెల్టాను కరువు ప్రాంతంగా
ప్రకటించాలని డిమాండ్
సాక్షి, చైన్నె: ‘‘రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలపై గళమెత్తుతాం. పాలనా సామర్థ్యం లేని ఒక డమ్మీ సీఎం వల్లే తమిళనాడుకు ఈ పరిస్థితి ఏర్పడింది’’ అని తంజావూరులో డీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. తంజావూరులో డీఎంకే ఆధ్వర్యంలో టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిగింది. మాజీ మంత్రి కే.ఎన్. నెహ్రూ, మనది నేయ మక్కల్ కట్చి ప్రధాన కార్యదర్శి జవాహిరుల్లా, మక్కల్ జననాయక కట్చి రాష్ట్ర అధ్యక్షుడు తమీమున్ అన్సారీ, ద్రావిడర్ కళగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. జయకుమార్, డీఎంకే మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు సహా పలువురు పాల్గొన్నారు. వేలాదిగా డీఎంకే వర్గాలు తరలి వచ్చి టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగానినాదాలు హోరెత్తించారు. కావేరి హక్కులను తాకట్టు పెట్టేస్తున్నారని, కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసన ప్రదర్శనలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే యువజన విభాగ కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఆడిప్పెరుక్కు సమయంలో, కావేరి డెల్టా నదులు నీరు లేక ఎండిపోయి ఎడారిలా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కురువై పంటను కాపాడుకోలేక, సాంబా పంట పరిస్థితి ఏమవుతుందో అని రైతులు తీవ్ర వేదన చెందుతున్నారన్నారు. కావేరి యాజమాన్య బోర్డు తీర్పు ప్రకారం రావాల్సిన న్యాయమైన నీటిని పొందడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.
పూర్తిగా రుణ మాఫీ..
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి, రైతుల డిమాండ్లు, కావేరి నీటి హక్కులపై ఆగస్టు 5న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో డీఎంకే తరఫున కచ్చితంగా గళం విప్పుతామన్నారు. ప్రజా క్షేత్రం, కోర్టులు, అసెంబ్లీ.. ఇలా అన్ని వేదికల పై రైతుల హక్కుల కోసం డీఎంకే నిరంతరం తోడుగా ఉంటుందన్నారు. రైతుల కన్నీళ్ల గురించి పట్టించుకోకుండా మంత్రులు సినిమాలు చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏదైనా ఒక సమస్య వస్తే, దాన్ని ఎలా దారి మళ్లించాలి అనే పనిలోనే ఈ పాలకులు నిమగ్నమవుతున్నారే గానీ, సమస్య వస్తే పరిష్కారం చూపించడంలో పూర్తి గా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కావేరి సమస్యపై తమిళనాడు మొత్తం తీవ్రంగా చర్చిస్తుంటే, సీఎం విజయ్ పరిశీలన పేరిట రీల్స్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా రీల్స్ చేసుకుంటూ తిరుగుతున్నారని, చివరకు మరుగుదొడ్లను కూడా వదలకుండా రీల్స్ చేస్తున్నారని, ఇలా రీల్స్ చేసుకునే దిగజారుడు ప్రభుత్వాన్ని తమిళనాడు ఇప్పటివరకు చూడలేదన్నారు.
ఆయన వల్లే కావేరికి ఈ దుస్థితి
రైతలు హక్కులను కాపాడుదాం..
మేఘదాతు వద్ద ఆనకట్ట నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న కర్ణాటక ప్రభుత్వాన్ని ఖండిస్తూ, తమిళనాడు రైతుల హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చట్టపరమైన పోరాటాన్ని వేగవంతం చేయాల ని డిమాండ్ చేశారు. కురువై పంట దెబ్బతినడంతో సుమారు 14 లక్షల మంది రైతులు నష్టపోయారని, ఈ దృష్ట్యా డెల్టా జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి, బాధితులైన రైతులకు ఎకరాకు రూ. 25,000 పరిహారం అందించాలని డిమాండ్చేశారు. అలాగే, పంటల విమా ప్రీమియంను ప్రభుత్వమే భరించడంతో పాటు, సంబా పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను రాయితీ ధరలకు అందించాని సూచించారు.


