– మంత్రి రమేష్ సమాచారం
సాక్షి, చైన్నె : దేవాదాయ శాఖలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేసే అంశంపై పరిశీలిస్తున్నామని ఆశాఖ మంత్రి రమేష్ తెలిపారు. తిరుచ్చిలో సోమవారం మంత్రి మంత్రి రమేష్ విలేకరులతో మాట్లాడుతూ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నాయకులందరూ కొనియాడేలా అత్యుత్తమ పాలన అందిస్తున్నారన్నారు. ఓటు వేయని వారు కూడా సంతోషంగా జీవించే స్థాయిలో ఈ పాలన సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి ఒంటరి అయిపోయారని స్టాలిన్ అంటున్నారని, నిజానికి ఒంటరిగా మిగిలిపోయింది ఎవరో స్టాలిన్నే అడగండి అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మాట్లాడే స్టాలిన్, ఈరోజు అసెంబ్లీ వ్యవహారాలను ఇంట్లో ఉండి చూసే పరిస్థితికి ఒంటరి అయిపోయారనేది నిజం అని వ్యాఖ్యలు చేశారు. ప్రతీ విషయాన్ని మాట్లాడే చేయాల్సిన అవసరం లేదని, చేతల్లో చూపిస్తే చాలు అని వ్యాఖ్యలు చేశారు. తమ ముఖ్యమంత్రి చేతల్లో చూపించే వ్యక్తి అని, శ్రీరంగం ఆలయానికి వచ్చిన ఆంధ్ర మహిళ వద్ద రూ.2,000 లంచం తీసుకున్నారనే ఫిర్యాదుపై విచారణ జరుగుతోందన్నారు. కొన్ని ఆలయాల్లో కొందరు వ్యక్తుల వల్ల ఇలా జరుగుతోందన్నారు. దీనిపై విచారణ సాగుతోంది. ఆ విచారణ ఆధారంగా తప్పులు నిరూపితమైతే ఎంతటి వారైనా కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు పరిశీలిస్తున్నామన్నారు. ఏ యే ఆలయ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయో, ఏ యే తప్పులు జరిగాయనే అంశాలన్నింటిపై దృష్టి సారించామన్నారు. తమ చర్యల వల్ల వచ్చే ఫలితాలను త్వరలోనే చూస్తారని, ఆలయ ఆస్తులన్నీ రక్షించబడతాయని ధీమా వ్యక్తంచేశారు.


