సాక్షి, చైన్నె: మదురై మేలూరు సమీపంలో రెండు కార్లు ఢీ కొన్న ప్రమాదంలో ఐదుగురు విగత జీవులయ్యారు. ఓ కారు అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురు రోడ్లుపైకి దూసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. చైన్నెకి చెందిన శ్రీరామ్, రాజమేరి, రంజన సహా ఆరుగురు ఒకే కారులో కోవిల్పట్టిలో జరగనున్న ఒక వేడుక కు కారులో ఆదివారం బయలుదేరి వెళ్లారు. సోమవారం వేకువ జామున మేలూరు సమీపంలోని తుంబైపట్టి ఫ్లైఓవర్ పై వస్తుండగా ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్ దాటుకుని ఎదురుగా ఉన్న రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఊహించని విధంగా మధురై నుండి తిరుచ్చి వైపు వెళ్తున్న మరొక కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీరామ్, అందులో ప్రయాణిస్తున్న రాజమేరి, రంజన , ఏడాదిన్నర పసిపాపతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక కారు డ్రైవర్ ప్రకాష్, ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మేలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మేలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఇదే మార్గంలో రెండు వారాల క్రితం కొట్టాంపాటి సమీపంలోని ఫోర్–లేన్ రహదారిపై రెండు బస్సులు ఢీకొని ఐదుగురు మరణించారు. తాజాగా ఇదే మార్గంలో రెండుకార్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మరణించడంతో ఈ పరిసరాలలో వేగ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆ పరిసర వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.


