ఇద్దరూ ఆటో ప్రమాదాల్లోనే మృతి
బస్వాపూర్లో ఘటన
నిజామాబాద్ భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామానికి చెందిన కాసాల రమేశ్ గౌడ్ (50) గ్రామంలో ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం మెదక్ జిల్లా రామాయంపేటకు వెళ్లి అక్కడ పనులు ముగించుకొని తిరిగి బస్వాపూర్ వచ్చేందుకు ఆటో ఎక్కాడు.
బస్వాపూర్ శివారులోని జాతీయ రహదారిపై వస్తుండగా ముందు వెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపటంతో వెనుక వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రమేశ్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ శ్రీనివాస్గౌడ్తోపాటు ప్రయాణికులు లక్ష్మి, శ్వేతలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతుడికి భార్య స్వప్న, కుమారుడు ధనుష్, కుమార్తె విదూష ఉన్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు. ప్రమాదం జరిగిన వెంటే లారీ డ్రైవర్ పరారయ్యాడని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
15 ఏళ్ల క్రితం అన్న..
గురువారం మృతి చెందిన రమేశ్ గౌడ్ అన్న కూడా గతంలో ఆటో ప్రమాదంలోనే మృతి చెందారు. దాదాపు 15 ఏళ్ల క్రితం బస్వాపూర్ గ్రామానికి చెందిన కాసాల శ్రీనివాస్ గౌడ్, పొందుర్తి శివారులోని జాతీయ రహదారిపై జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందాడు. ప్రస్తుతం ఆయన సోదరుడు రమేశ్ గౌడ్ కూడా ఆటో ప్రమాదంలో మృతి చెందడం గ్రామస్తులు, బంధువులను తీవ్రంగా కలిచివేసింది.


