నగరంలోని సైకిళ్లన్నీ మాయం.. కారణం తెలిసి పోలీసులే షాక్‌! | Sakshi
Sakshi News home page

ఔరా! ఒంటి చేత్తో నగరంలోని సైకిళ్లన్నీ మాయం చేసిన దొంగ

Published Mon, Sep 26 2022 8:35 PM

Bicycle Thief Arrested In Haryana Police Recover 62 Bicycles - Sakshi

చండీగఢ్‌: హరియాణాలోని పంచకుల జిల్లా కేంద్రంలో కొద్ది రోజులుగా సైకిళ్లు మాయమవుతున్నాయి. ఒక్కసారిగా సైకిళ్లు మాయమవుతున్నట్లు ఫిర్యాదులు పెరగటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల్లోనే కేసు ఛేదించారు. అయితే.. పోలీసులే విస్తుపోయే సంఘటన ఎదురైంది. నగరంలోని సైకిళ్లన్నింటిని ఒకే వ్యక్తి ఎత్తుకెళ్లటం ఆశ్చర్యానికి గురి చేసినట్లు పోలీసులు తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచకుల జిల్లాలోని మంజ్రి గ్రామంలో రవి కుమార్‌(32) అనే వ్యక్తి జీవిస్తున్నాడు. పంచకుల జిల్లా మొత్తం తిరుగుతూ సైకిళ్లు ఎత్తుకెళ్లే పని పెట్టుకున్నాడు. ఇటీవలే సెప్టెంబర్‌ 14న సెక్టార్ 26లో సుమారు  రూ.15,000 విలువ చేసే సైకిల్‌ను మాయం చేశాడు. సెక్టార్స్‌ 2,4,7,9,10,11,12,12A,20, 21,25లలో సైకిళ్లు చోరీకి గురయ్యాయనే ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు రోజుల తర్వాత రవికుమార్‌ను అరెస్ట్‌ చేశారు. నిఘా కెమెరాల ఆధారంగా మొత్తం 62 సైకిళ్లను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ‘సీసీటీవీ ఫుటేజ్‌, సైబర్‌ టెక్నాలజీ ఆధారంగా పంచకుల జిల్లా మొత్తం ఒకే వ్యక్తి సైకిళ్లు దొంగతనం చేసినట్లు తేలింది. ఈ సైకిళ్లు గరిష్ఠంగా రూ.20,000 వరకు ధర ఉన్నాయి.’ అని పోలీసులు తెలిపారు. 

దొంగతనం చేసిన సైకిళ్లను అత్యంత తక్కువ ధరకు రూ.2,000లకే అమ్మటం.. వచ్చిన డబ్బును మత్తుపదార్థాలు కొనుగోలు చేసేందుకు వినియోగించటం చేస్తున్నాడు. ‘2021లో లుథియానా నుంచి చండీగఢ్‌లోని రాయ్‌పుర్‌ ఖుర్ద్‌కు మకాం మార్చాడు రవి. జిరాక్‌పుర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేవాడు. తన ఉద్యోగం పోయిన క్రమంలో మత్తుకు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత పంచకులకు మారి దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తున్నాడు.’ అని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు తెలిపాడు.

ఇదీ చదవండి: భర్తను చితకబాది.. భార్యను లాక్కెళ్లి ఆరుగురు గ్యాంగ్‌ రేప్‌!

Advertisement
Advertisement