‘కానరాని లోకాలకు చిట్టితల్లి’ | AP News: Punganur Girl Missing Case Turns Tragedy | Sakshi
Sakshi News home page

‘కానరాని లోకాలకు చిట్టితల్లి..’ పుంగనూరు మిస్సింగ్‌ కేసు విషాదాంతం

Oct 2 2024 3:51 PM | Updated on Oct 2 2024 3:59 PM

AP News: Punganur Girl Missing Case Turns Tragedy

చిత్తూరు, సాక్షి: పోలీసులకు సవాల్‌గా మారిన పుంగనూరు చిన్నారి అదృశ్యం కేసు.. విషాదాంతం అయ్యింది. నాలుగు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక అస్పియా ఇవాళ శవంగా కనిపించింది. తన చిట్టితల్లి సురక్షితంగానే ఉండి ఉంటుందని, ఏ క్షణంలోనైనా తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆ తల్లికి.. చివరకు కడుపు కోతే మిగిలింది.  

సెప్టెంబర్‌ 29వ తేదీ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటోంది ఆస్పియా. కరెంట్‌ పోయి వచ్చాక చిన్నారి కనిపించలేదు. కంగారుపడిన తల్లి.. తండ్రి అజ్మతుల్లాకు ఫోన్‌ చేసి సమాచారం అందించింది. స్థానికంగా వెతికినా ఆమె కనిపించలేదు. దీంతో అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు.  

మూడు రోజులుగా బాలిక ఆచూకీ కనిపెట్టడం కోసం పోలీసులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఏకంగా 11 ప్రత్యేక బృందాలతో, డాగ్‌ స్క్వాడ్‌తో పుంగనూరు చుట్టుపక్కల జల్లెడ పట్టారు.  అయితే ఇవాళ (బుధవారం) ఉదయం సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో ఓ శవం తేలుతుందని పోలీసులకు సమాచారం అందింది.

హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. అదొక చిన్నారి మృతదేహంగా తేల్చారు. అస్పియా తండ్రిని పిలిపించి.. ఆ చిన్నారిదేనని నిర్ధారణకు వచ్చారు. తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు.. బిడ్డ మృతితో రోదించారు. చిన్నారి విగత జీవిగా మారిందని తెలియడంతో పట్టణమంతా శోకసంద్రంలో మునిగింది.  అయితే బాలిక అక్కడికి ఎలా వెళ్లింది? ప్రమాదవశాత్తు చెరువులో పడిందా..? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి చంపి పడేసారా?.. ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement