సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు దందాలకు తెగబడుతున్నారు. పౌరసరఫరాల శాఖలోని కొందరు అవినీతి అధికారుల అండదండలతో రేషన్ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా దశాబ్దాలుగా ఉన్న డీలర్లను బెదిరించి దాదాపు 300లకు పైగా చౌక దుకాణాలను లాక్కున్నారు. తాజాగా బోగస్ డీలర్లను తెరపైకి తెచ్చి పేదల బియ్యాన్ని నొక్కేసేందుకు కుట్రలు పన్నుతున్నారు.
నెలల తరబడి నిరుపేదల అవస్థలు
కూటమి నేతల వేధింపులు, చట్ట విరుద్ధమైన ఆక్రమణల కారణంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రేషన్ పంపిణీ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. పలు షాపులకు ధాన్యపు కోటాను నిలిపివేయడంతో జీరో రేషన్ పరిస్థితి దాపురించింది. ఫలితంగా నెలాఖరు వచ్చేసరికి పొట్టచేత పట్టుకుని రేషన్ షాపుల ముందు నిలబడే నిరుపేదలకు ఖాళీ చేతులే మిగులుతున్నాయి. నెలల తరబడి బియ్యం అందక పేద కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతుంటే, మరోపక్క కూటమి నాయకులు పౌరసరఫరాల బియ్యాన్ని కాజేసి పక్కదారి పట్టిస్తున్నారు. చివరికి వీఆర్ఏల పేరిట నడుస్తున్న షాపుల్లోనూ తమ అనుకూల బోగస్ వ్యక్తులను నిలిపి దోపిడీకి పాల్పడుతున్నారు.
అక్రమాలు జరిగితే
6ఏ కేసులు ఎవరిపై పెడతారు?
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,220 రేషన్ షాపులు నడుస్తుండగా, దాదాపు 4.80 లక్షల రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఉన్న జిల్లాలో పదుల సంఖ్యలో బోగస్ షాపులు నడుస్తుండటంపై డీలర్లు, డీలర్ల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బియ్యం పక్కదారి పడితే చట్టప్రకారం 6ఏ కేసులను ఎవరిపైన పెడతారని నిలదీస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడి జిల్లా వ్యాప్తంగా సమగ్ర విచారణ జరిపించకపోతే.. కూటమి నేతల అండతో మరిన్ని బోగస్ షాపులు పుట్టుకొచ్చి పేదల రేషన్ వ్యవస్థ పూర్తిగా నాశనమయ్యే ప్రమాదముందని పలు డీలర్ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ఇక్కడ నామినీగా కూటమి నేత
పౌరసరఫరాల శాఖలోని కొందరు సిబ్బంది మామూళ్ల కక్కుర్తి ఎంతటి పరాకాష్టకు చేరిందో చెప్పడానికి చిత్తూరు మండలంలో వెలుగుచూసిన ఘటనే సజీవ నిదర్శనం. విదేశాల్లో నివాసముంటున్న ఒక మహిళ పేరిట దర్జాగా రేషన్ షాపు నడుపుతూ, దానికి నామినీగా ఓ కూటమి నేత చలామణి అవుతున్న వైనం స్థానికులను విస్తుపోయేలా చేసింది. ఈ అక్రమంపై సహించలేని గ్రామస్తులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో ఈ బోగస్ దందా రచ్చకెక్కింది. పులిచెర్ల మండలంలోనూ ఇటువంటి ఘోరమైన అక్రమం బయటపడింది. నామినీ స్థానంలో పేరుకు బదులుగా రికార్డుల్లో ఎన్ఏఏ అని చూపిస్తూ వెనుక ఉండి కూట మి నాయకులు దందాను నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు నామినీయే లేడని బుకాయించేందుకు ఎన్ఏఏ అని పెట్టి, అధికారులే స్వయంగా బోగస్ దారులకు సహకరిస్తుండడం గమనార్హం. నామినీ లేకుంటే ఎన్ఏ మాత్రమే ఉండాలని, అసలు వీఆర్ఏ ఉన్న షాపునకు నామినీ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.


